హైదరాబాద్ : ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఉర్సె షరీఫ్ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి లోని యూసిఫియన్ దర్గాను మంత్రి శుక్రవారం సందర్శించారు. చాదర్ సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. దర్గా వద్ద మంత్రికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, వక్ఫ్ బోర్డు సభ్యుడు వహీద్ హైమద్ ఘన స్వాగతం పలికారు. మంత్రి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం కేసీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ లు ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని, కరోనా మహమ్మారి అంతమై తెలంగాణ మరింత పురోగమించాలని, ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని కోరుతూ దర్గా సూపరింటెండెంట్ మహ్మద్ మస్తాన్, మత పెద్దలు దువా చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తున్నదన్నారు. ఇమాం, మౌజంలకు గౌరవ వేతనాలిస్తున్నట్లు చెప్పారు. 10 వేల మందికి రూ. 5 వేల చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. నాంపల్లిలోని అనీస్-ఉల్-గుర్భా అనాథాశ్రమాన్ని రూ. 39 కోట్లతో మళ్లీ కడుతున్నట్లు వివరించారు. అజ్మీర్ దర్గా వద్ద రూ.15 కోట్లతో రుబాత్ నిర్మాణం చేపట్టామన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపాన జహంగీర్ పీర్ దర్గాను గొప్పగా అభివృద్ధి చేసే ప్రణాళిక సిద్ధమవుతున్నదన్నారు. రూ.8.5 కోట్లతో చారిత్రాత్మక మక్కామసీదులో మరమ్మత్తులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖులు డాక్టర్ ముఫ్తీ మహ్మద్ మస్తానలీ ఖాద్రీ, సయ్యద్ ఫహీం, మహ్మద్ మాజీద్, వక్ఫ్ బోర్డు అసిస్టెంట్ సెక్రటరీలు ఖాజీ ఫారూఖ్, మహ్మద్ మన్సూర్, మహ్మద్ అఖీద్, టిఆర్ఎస్ నాయకులు గౌస్, సలీం తదితరులు పాల్గొన్నారు.