హైదరాబాద్ : ఆగస్టు 6వ తేదీ. తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ సార్ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆచార్య జయశంకర్ త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడుగా, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ జన హృదయాల్లో సదా నిలిచి ఉంటారని సీఎం కేసీఆర్ తెలిపారు. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ది కోసమే తెలంగాణ స్వరాష్ట్రం అని తెలిపిన ప్రొ.జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం వొక్కొక్కటిగా నెరవేరుస్తున్నదని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని సాధించిన ఏడేండ్ల అనతికాలంలోనే సాగునీటి రంగం, వ్యవసాయరంగం, వంటి పలు మౌలిక భౌతిక రంగాలను తీర్చిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు.
అదే వరుసలో సకల జనుల సమున్నతాభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం, సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని సీఎం తెలిపారు. మిషన్ కాకతీయ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు, రైతుబంధు నుంచి దళితబంధు వరకు అనేక వినూత్న పథకాలను అమలు చేస్తున్నదన్నారు. ఆర్థిక సామాజిక రంగాల్లో అభివృద్ధిని సాధించి ఆత్మగౌరవంతో దళిత బహుజన సమాజం తలఎత్తుకుని తిరిగే విధంగా, తెలంగాణలో సమ సమాజ స్థాపన దిశగా, బంగారు తెలంగాణ సాధన కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, ప్రొ.జయశంకర్ కలలుగన్న తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ తెలిపారు.