హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): పరీవాహక ప్రాంతం, సాగు భూమి విస్తీర్ణం, కరువు పీడిత ప్రాంతాలు ఇలా ఏ అంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నా కృష్ణా నదీ జలాల్లో తమకే ఎక్కువ వాటా దక్కుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ట్రిబ్యునల్ ఎదుట ఇవే ప్రతిపాదనలను పెట్టామని.. అవార్డులను ప్రకటించేదాకా తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు 50:50 నిష్పత్తిలో నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను కోరింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారం, లేకుంటే గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం మాత్రమే రెండురాష్ర్టాల మధ్య కేఆర్ఎంబీ నదీ జలాల పంపిణీ, వినియోగాన్ని నియంత్రించాల్సి ఉంటుందని మరోసారి గుర్తుచేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 70.8 శాతం ఉండగా, ఏపీలో 29.2 శాతమే ఉన్నదని వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు 771 టీఎంసీల వాటా దక్కాల్సి ఉంటుందని.. దీనిపై ఇప్పటికే ట్రిబ్యునల్ ఎదుట సహేతుకమైన ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు. నదీ జలాల కేటాయింపులో బేసిన్లోఉన్న రాష్ర్టాలకు తొలి ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాతే అవతలి ప్రాంతాలకు అందించాలని గతంలోనే బచావత్ ట్రిబ్యునల్, ప్రస్తుత కేడబ్ల్యూడీటీ-2 కూడా అనేకమార్లు నొక్కి చెప్పాయని ఉదహరించారు. ఈ నేపథ్యంలో 2021-22 నీటి సంవత్సరానికి అందుబాటులోఉన్న కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీలకు 50ః50 నిష్పత్తిలో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను అక్రమంగా తరలిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి మరోసారి ఫిర్యాదుచేసింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతుల్లేకుండా, అనధికారికంగా అనేక ప్రాజెక్టులను, నీటి మళ్లింపు వ్యవస్థలను ఏర్పాటుచేసిందని పేర్కొన్నది. ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలని, బేసిన్లోని ప్రాంతాల అవసరాలను తీర్చాలని అనేకమార్లు కేంద్ర జల్శక్తికి, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశామని గుర్తుచేసింది.