యాదాద్రి, ఏప్రిల్ 26: అదే బాట.. అదే మాట. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగుజాడల్లో .. నాడు ఉద్యమనాయకురాలిగా రాష్ట్ర సాధనలో.. ఇప్పుడు ఉద్యమస్ఫూర్తితో ప్రగతిఫలాలు అందించేందుకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి శ్రమిస్తున్నారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భవించిన నాటి నుంచి ఆలేరు ఉద్యమ నాయకులుగా గొంగిడి సునీత, గొంగిడి మహేందర్రెడ్డి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఆలేరు నియోజకవర్గ ప్రజానికాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చారు. ఊర్లన్నీ జై తెలంగాణ.. జైజై కేసీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు. 2001లోనే ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు స్థానిక సంస్థల్లో పోటీచేసి ఊహించని రీతిలో గెలుపొందారు. 2003లో రామాజీపేటలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణకు కేసీఆర్ హాజరై ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు వివరించారు. 2010లో యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో టీఆర్ఎస్ చందా కోసం కేసీఆర్ కార్మికుడిగా మారారు. 2001లో పార్టీ ఆవిర్భావ కాలంలో జరిగిన మండల పరిషత్ ఎన్నికల సమయంలో గొంగిడి దంపతులు టీఆర్ఎస్లో చేరి, నాటి నుంచి సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నారు. బీడుబారిన ఆలేరు నియోజకవర్గానికి సాగుజలాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి, గుండాల, బొమ్మలరామారం మండలాలకు గోదావరి పరవళ్లు తొక్కుతున్నాయి.
2015లో యాదాద్రి అభివృద్ధికి అంకురార్పణ..
సీమాంధ్ర పాలకుల చేతులో తెలంగాణలో ఉన్న దేవాలయాలు నిరాదరణకు గురయ్యాయి. ఇక్కడి ఆలయాల ఆదాయం తరలించుకుపోయారే తప్పా ఒక్క ఇటుకను సైతం మార్చలేని దుస్థితి. రాష్ట్ర ఏర్పాటుతో ఆలయాలకు పూర్వవైభవం తీసుకువస్తామని ఉద్యమనాయకుడైన కేసీఆర్ అప్పట్లోనే హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం యాదాద్రి అభివృద్ధికి బాటలు వేశారు. ప్రధానాలయ తూర్పు రాజగోపురం వద్ద 2015లోని దసరా రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు అంకురార్పన చేశారు.విమానగోపురం, గర్భాలయం పనులకు స్థపతి సలహాదారు వేలు, ఆర్కిటెక్ట్ ఆనందసాయి, సుందరరాజన్తో ప్లాన్ వేయగా చినజీయర్స్వామి ఆమోదం తెలిపారు. వారి సూచనల ప్రకారం రూ. 2000 వేల కోట్ల అంచనాతో నిర్మాణం చేపట్టగా యాదాద్రీశుడి ఆలయ నిర్మాణం దాదాపు పూర్తికాగా, కొండ కింద భక్తుల వసతుల పనులు తుదిదశకు చేరుకున్నారు.
60 ఏండ్ల అరిగోస తీర్చాం
14 ఏండ్ల పోరాటంతో నాటి ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించాం. అధినేత కేసీఆర్ నింపిన స్ఫూర్తితో తెలంగాణ గమ్యాన్ని ముద్దాడేదాకా అలుపెరగని పోరాటం చేశాం. 2001లోనే ఆలేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నాం. ఎన్నో సార్లు ఆలేరు నియోజకవర్గానికి కేసీఆర్ వచ్చి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. 2014, 2018లో ఆలేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తనకు క్యాబినెట్ చోటు కల్పించారు. 60 ఏండ్ల పాలనలో ఆలేరు నియోజకవర్గం ఏడారిగా మారింది. ఇక్కడి నుంచి ఎంతో మంది రైతులు హైదరాబాద్కు వలసబాట పట్టారు.
వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే పరి స్థితి ఉండేది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన అనంతరం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ పథకం, రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు పంపిణీ చేశారు. దీంతో వలస వెళ్లిన రైతులు గ్రామాల్లోకి చేరుకున్నారు. దండుగ అన్న ఎవుసం పండుగలా మారింది. ఆలేరు నియోజకవర్గంలో ఉన్న 53,500 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణంలో 98 శాతం సాగులోకి తీసుకువచ్చాం. టీఆర్ఎస్ ఏడేండ్ల పాలనలో ప్రతి ఇంటికీ ప్రగతి ఫలాలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ఇటు నృసింహస్వామి జలాశయం, నావాబ్పేట జలాశయం, బునాదిగాని కాల్వలతో ఆలేరు నియోజకవర్గాన్ని మరో కోనసీమగా మార్చేంతవరకు విశ్రమించేది లేదు.
-గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే