వనపర్తి, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ జలదోపిడీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుండటంపై నిప్పులు చెరిగారు. ఎలాంటి హక్కు లేకుండా ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తే ఊరుకోబోమని, అక్కడే పాతరేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఆయన వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, నాటి పాలకులు తెలంగాణ ప్రయోజనాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. స్వరాష్ట్ర పాలనతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని భావించినందువల్లే కొట్లాడి రాష్ర్టాన్ని తెచ్చుకున్నామన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ సైంధవ పాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు. దాదాగిరీ, గుండాగిరీని నడిపిస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని, తెలంగాణ హక్కులకు విరుద్ధంగా కృష్ణా బేసిన్లో దోసెడు నీళ్లును కూడా తీసుకోనివ్వబోమని ఘాటుగా హెచ్చరించారు. వెన్నెముక లేని బానిస నేతల మూలంగానే గతంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఏపీ జలదోపిడీని అడ్డుకొని తీరుతామని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత దూరం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమైక్య పాలనలో ఆంధ్రా జలదోపిడికి మద్దతుగా హారతులు పట్టినోళ్లు, దొంగ ప్రాజెక్టులకు సద్దులు మోసిన ఇంటి దొంగలు ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని హాహాకారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శించారు. ప్రాజెక్టులు కట్టుకునేందుకు ఏపీకి శాశ్వత నీటి కేటాయింపులు ఎక్కడున్నాయని మంత్రి ప్రశ్నించారు. ఈ దేశంలో రాజ్యాంగం అమలవుతోందన్న విషయాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. నీటి కేటాయింపులు జరిగి అన్ని రకాల అనుమతులు వచ్చాకనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని లిఖితపూర్వకంగా రాసిచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ రాజ్యాంగానికి, విభజన చట్టంలోని నిబంధనలకు, సహజ న్యాయ సూత్రాలకు తూట్లు పొడుస్తోందని మంత్రి వివరించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్కు నిర్ణీత కాలగడువు విధించి కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటాలను తేల్చాలని అన్నారు. వృథాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుందామని సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్కు స్నేహ హస్తం అందించారని గుర్తు చేశారు. కేసీఆర్ ఎంతో దూరదృష్టితో చేసిన ఈ సూచనలను వదిలేసి కృష్ణా జలాలను అక్రమంగా తీసుకుపోతామనడం మిత్ర దోహమేనని పేర్కొన్నారు.
పంజాబ్, హర్యానాతో సమానంగా వరి దిగుబడి
పంజాబ్, హర్యానాలతో సమానంగా తెలంగాణలో వరి ఉత్పత్తి అయిందని, ఒక్క ఏడాదిలోనే 3 కోట్ల టన్నుల దిగుబడి వచ్చిందని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. అన్నదాతలకు మెళకువలు తెలిపి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయించాలన్నదే రైతు వేదికల ఉద్దేశమని మంత్రి గుర్తు చేశారు. పంటల మార్పిడిపై రైతులు దృష్టి సారించి పప్పుదినుసులు, నూనెగింజలు, పత్తి లాంటి పంటలను సాగుచేయాలని ఆయన సూచించారు.