సిటీబ్యూరో, మే 6(నమస్తే తెలంగాణ)/బన్సీలాల్పేట : కరోనాతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమవారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు కొవిడ్ సహాయక కేంద్రం ఏర్పాటైంది. గురువారం దీన్ని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో కలిసి నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కొవిడ్తో బాధపడుతున్న వారి కుటుంబసభ్యులకు లోపలికి అనుమతి లేదని, ఈ హెల్ప్ సెంటర్ నుంచి లోపల వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చన్నారు.
అనవసరంగా కుటుంబసభ్యులు, బంధువులు దవాఖానకు రావొద్దని, గతంలో చికిత్స పొందుతున్న వారికోసం వచ్చిన వారు చాలామంది కొవిడ్ బారిన పడ్డారని గుర్తుచేశారు. వైద్యులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో హెల్ప్ సెంటర్ పనిచేస్తుందని, దీంతోపాటు దవాఖానలో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయనే సమాచారం కూడా తెలుసుకోవచ్చని, దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను తయారు చేశామన్నారు. ఇలాంటి సహాయక కేంద్రాలను ఇతర పెద్ద దవాఖానల్లోనూ ప్రారంభిస్తామన్నారు. కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్న వైద్య బృందానికి నగర పోలీసుల తరపున సెల్యూట్ చేస్తున్నామని సీపీ అన్నారు.
చాలామంది పోలీసులు కూడా కరోనా బారినపడ్డారని, అందులో కొందరు కోలుకోగా, మరికొందరు చికిత్స పొందుతున్నారని చెప్పారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మాట్లాడుతూ దవాఖానలో రోగి రాగానే ట్రైయాజ్ వద్ద వైద్యులు పరిశీలించి, ఎక్కడ బెడ్లు ఖాళీ ఉన్నాయో అక్కడికి తరలిస్తారని, ఇందుకోసం గతేడాదిగా బెడ్ మేనేజ్మెంట్ సిస్టం సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నామని అన్నారు. దీన్ని కొవిడ్ హెల్ప్డెస్క్కి అనుసంధానం చేస్తామని తెలిపారు. త్వరలో 24 గంటలు పనిచేసే రెండు టెలిఫోన్ నెంబర్లను ప్రకటిస్తామని, వాటిద్వారా కూడా రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు సీపీ డీఎస్ చౌహాన్, నార్త్జోన్ డీసీపీ కమలేశ్వర్ సింగన్వర్, గాంధీ దవాఖాన డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహారావు, ఆర్ఎంవోలు డాక్టర్ ప్రభాకర్రెడ్డి, డాక్టర్ ప్రభుకిరణ్, నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.