ఖలీల్వాడి/ విద్యానగర్, మార్చి 16: కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకునేంత వరకూ ఆందోళన కొనసాగిస్తామని బ్యాంకు ఉద్యోగులు స్పష్టం చేశారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త రెండు రోజుల సమ్మెలో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉమ్మడి జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించారు.ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్ నుంచి పూలాంగ్ చౌరస్తా వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. కేంద్రం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో కన్నా బ్యాంకింగ్ రంగం కీలకమైందన్నారు. ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సామాన్యులు, రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయన్నారు. ప్రైవేటీకరణ ఆపి బ్యాంకులను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేదిలేదు. మరో ఐదు రోజులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మోదీ ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ ఆలోచనను ఉపసంహరించుకోవాలి. బ్యాంకుల ప్రైవేటీకరణతో కార్పొరేట్ వ్యవస్థనే బాగుపడుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలి.
-రమేశ్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు,యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్
పేదలు గ్యాస్ సబ్సిడీ, రుణాలు తీసుకో వడానికి ప్రభుత్వ బ్యాంకులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఖాతా తీయడానికి కనీసం రూ. పది వేలు మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు లను ప్రైవేట్పరం చేయడంవల్ల పేదలకు మెరుగైన సేవలు అందించలేం.
-రాజేశ్వర్రావు, కామారెడ్డి జిల్లా కన్వీనర్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్
ప్రభుత్వ రంగ బ్యాంకులపైన నమ్మకంతో ప్రజలు డిపాజిట్లు చేస్తారు. ప్రైవేటీకరణ చేస్తే వారు ఎవరిని నమ్మాలి. వారి డిపాజిట్లకు ఎవరు బాధ్యత వహిస్తారు. ప్రైవేటీకరణతో బడా కార్పొరేట్ కంపెనీలే బాగుపడతాయి. వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలి. లేకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం.
-సుమలత, బ్యాంకు ఉద్యోగిని, నిజామాబాద్
మోదీ ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులను చిన్నచూపు చూస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్ని స్తోంది. ఇది సరైన నిర్ణయం కాదు. ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అందుతాయి. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహ రించుకోవాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగిస్తాం.
-మనోజ్ సింగ్, ప్రధాన కార్యదర్శి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్, నిజామాబాద్
కేంద్ర ప్రభుత్వం కేవలం బడా పారిశ్రామిక వేత్తల కోసమే బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నది. దీంతో ఎక్కువ డబ్బులు ఉన్నవారు మాత్రమే ప్రైవేట్ బ్యాంకులను సంప్రదిస్తారు. పేదలు ఎక్కువ డబ్బులు కట్టి బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం లేదు.
-అనుదీప్, యూఎఫ్బీయూ ప్రతినిధి, కామారెడ్డి