హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయించింది. ఏడాదికి రూ.2 వేలకోట్ల చొప్పున రెండేండ్లలో అన్ని పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలికవసతులు కల్పిస్తారు. రాష్ట్రంలో 1,751 ప్రభుత్వ, 24,311 స్థానిక సంస్థల, 475 కస్తుర్బాగాంధీ బాలికల, 194 మోడల్, 35 తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. కొన్నిపాఠశాలలు మౌలికవసతుల కొరతతో సతమతమవుతున్నాయి. ఈ పాఠశాలల్లో రెండేండ్లలో స్మార్ట్క్లాసులు, కొత్త భవనాలు, తాగునీరు, డ్యూయల్ డెస్క్ బల్లలు, అదనపు తరగతి గదులను ఏర్పాటుచేయనున్నారు. కరోనా తర్వాత బోధనావిధానం మొత్తం డిజిటల్ రూపంలోకి మారిపోతుంండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. అసెంబ్లీ నియోజకర్గాలు, మండలాలవారీగా ఎక్కువమంది విద్యార్థులున్న పాఠశాలలకు ఈ పథకంలో ముందుగా ప్రాధాన్యం ఇస్తారు. తాజా బడ్జెట్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పథకంతో ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలవైపు మళ్లుతారని ఆశిస్తున్నారు.
మానవవనరుల అభివృద్ధిలో అత్యంత కీలకమైన విద్యారంగానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు పెంచారు. పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యలకు కలిపి మొత్తం రూ.13, 886 కోట్లు కేటాయించారు. విద్యారంగానికి పునాదిలాంటి పాఠశాల విద్యకు ప్రాధాన్యమినిస్తూ రూ.11 వేల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. స్కూళ్లలో మౌలికవసతుల కల్పనకు రూ. 4 వేల కోట్ల పద్దును నిర్ణయించారు. రాష్ట్రీయ ఉచత్తర్ శిక్షా అభియాన్కు రూ.75.71 కోట్లు, ఇంటర్ విద్యకు నిర్వహణ పద్దు కింద రూ.462 కోట్లు, అడ్మిషన్ ఫీజుల మాఫీ, ఉచిత పాఠ్యపుస్తకాలు, ప్రయోగశాల పరికరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీల నిర్మాణానికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి కలుపుకొని మొత్తం రూ.49. 18 కోట్లు కేటాయించారు. కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల ప్రహరీగోడల నిర్మాణానికి రూ.10 కోట్లు, అసంపూర్తిగా ఉన్న మోడల్ స్కూల్స్ భవనాల నిర్మాణానికి రూ.2.76 కోట్ల, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలు, కళాశాలల్లో అదనపు వసతుల కల్పనకు రూ.69.96 కోట్లు వెచ్చించనున్నారు.
విద్యాశాఖపై ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనకు రెండేండ్లలో రూ.4 వేల కోట్లు కేటాయించడం సంతోషదాయకం. ఈ నిధులతో మౌళిక వసతులు పెంచి నాణ్యమైన విద్య అందిస్తాం. పాఠశాలలు, గురుకులాల ద్వారా ఒక పద్ధతి ప్రకారం విద్యాప్రమాణాలను క్రమంగా పెంచుతున్నాం. ప్రైవేట్కు ధీటుగా ఆన్లైన్ క్లాసులను విజయవంతంగా నిర్వహించడంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగింది. ఇదే నమ్మకాన్ని కాపాడుకుంటూ వారి విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నిస్తాం.
– సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి