హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ సామెత ఏపీ జెన్కోకు అతికినట్టు సరిపోతుంది. తెలంగాణలో విద్యుత్తు వెలుగులను చూసి తట్టుకోలేక నాలుగేండ్లుగా కాకి లెక్కలతో గారడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. తెలంగాణ విద్యుత్తు సంస్థల నుంచి తమకు రూ.6,283.68 కోట్ల బకాయి సొమ్ము రావాలంటూ సోమవారం హైకోర్టులో పిటిషన్వేసింది. నిజానికి స్పష్టంగా లెక్కలు తీస్తే ఏపీయే తెలంగాణకు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని మన విద్యుత్తు సంస్థల అధికారులు చెప్తున్నారు.
ఎన్సీఎల్టీలో పల్టీ కొట్టేలా..
తెలంగాణ విద్యుత్తు సంస్థలు తమకు బకాయి ఉన్నాయని, వాటిని చెల్లించనందున ఆ సంస్థలు దివాలా తీసినట్టుగా ప్రకటించాలని మూడేండ్ల క్రితం ఏపీ జెన్కో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్ వేసింది. దీనిపై మన విద్యుత్తు సంస్థలు కూడా కౌంటర్ దాఖలుచేశాయి. ఈ కేసులో ఓటమి ఖరారు కావటంతో మూడేండ్ల తర్వాత ఉన్నట్టుండి పిటిషన్ను ఉపసంహరించుకున్నది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణను కోర్టు వచ్చేనెల 28వ తేదీకి వాయిదా వేసింది.
అసలు నిజాలు ఇవీ..
చర్చలకు రావడం లేదు
రెండు రాష్ర్టాల విద్యుత్తు సంస్థల మధ్య ఉన్న బకాయిల విషయంపై కూర్చొని మాట్లాడుకుందామని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ ఏపీ విద్యుత్తు సంస్థలు మొండిగా వ్యవహరిస్తున్నాయి. చర్చలు జరిపితే మనకే ఏపీ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే చర్చలకు రావడంలేదు. తెలంగాణను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలా వ్యవహరిస్తున్నది. అన్ని లెక్కలు తీస్తే మనకే రూ.4,457 కోట్లు వస్తాయి.
-దేవులపల్లి ప్రభాకర్రావు, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ.