రాష్ట్రంలో కొందరు విపక్ష నేతలు బాయిలో కప్పల్లా వ్యవహరిస్తున్నారు. వారికి అధికారం, పదవి, రాజకీయం తప్ప ఇంకేం కనపడవు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలంటే ఈ కామెంట్ ఒకసారి చదవాలి..
ఒక ప్రైవేటు విమానం పంపి, రెడ్కార్పెట్ వేసి ఒక రాష్ట్రం మంత్రి రూ.2400 కోట్ల పెట్టుబడి తన రాష్ర్టానికి ఎలా సాధించారో చూడండి
ఈ మాట అన్నది ఆషామాషీ వ్యక్తి కాదు. దేశంలో పేరెన్నికగన్న వ్యాపారవేత్త, పీఆర్జీ గ్రూప్ చైర్మన్ హర్ష్గోయెంకా. బుధవారం ట్విట్టర్లో మంత్రి కేటీఆర్పై ఆయన చేసిన ట్వీట్ అది.
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కొద్దిరోజుల క్రితం కేరళ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొంటున్నట్టు ప్రఖ్యాత చిన్నపిల్లల గార్మెంట్ సంస్థ కిటెక్స్ ప్రకటించింది. ఆ వార్తను పేపర్లో చూసిన మంత్రి కేటీఆర్ వెంటనే స్వయంగా రంగంలోకి దిగి కిటెక్స్ ఎండీ సాబూ జాకబ్తో మాట్లాడి, ప్రత్యేక విమానాన్ని కేరళ పంపి, ఆ సంస్థ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంతటి అనుకూల వాతావరణం ఉన్నదో చూపించారు. ఇక్కడి పరిస్థితులకు ఫిదా అయిన జాకబ్.. ఎలాంటి సంకోచం లేకుండా వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో రూ.2,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ పెట్టుబడికి సంబంధించిన ఒప్పందం గత శనివారమే జరిగింది.
ఇదీ మంత్రి కేటీఆర్ పనితనం. ఈ పెట్టుబడిని తీసుకొచ్చిన విధానంపైనే హర్ష్గోయెంకా బుధవారం ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు తెలంగాణ భవిష్యత్తు గురించి తప్ప మరో ఆలోచన లేదు. తెలంగాణ ప్రజల సంక్షేమం తప్ప విపక్షాల విమర్శలను వారు పట్టించుకోరు. మంత్రి పనితీరును ఎంతో మంది ప్రముఖులు ఎన్నోసార్లు ప్రశంసించారు. వాటిలో కొన్ని..
కేటీఆర్ తెలివైన, హుషారైన మంత్రి మాత్రమే కాదు.. భారతదేశాన్ని ఎలా ప్రతిఫలింపజేసేందుకు మేమంతా కష్టపడుతున్నామో, ఆ అన్ని అంశాలు ఆయనలో ప్రతిఫలిస్తున్నాయి.
-హర్దీప్సింగ్ పురి, కేంద్ర మంత్రి
తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి విన్న తర్వాత, ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పనితీరు చూసి నాకు కొంచం ఆందోళన కలుగుతున్నది. మేం (పంజాబ్లో) నిర్వహిస్తున్న ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ కార్యక్రమం ఇదే మొదటిది.. ఇదే చివరిది అవుతుందేమోనని భయం గా ఉన్నది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ హైజాక్చేసి తెలంగాణకు తీసుకెళ్లబోతున్నారు. దీనిని అక్కడ నిర్వహించటమే కాదు.. కేటీఆర్ స్వయంగా దానికి నాయకత్వం వహించబోతున్నారు.
-హర్సిమ్రత్కౌర్ బాదల్, (కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు)
సవాళ్లను స్వీకరించి, పరిష్కారాలు చూపుతున్న.. వ్యాపార అవకాశాలు సృష్టించి తన రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తున్న కేటీఆర్లాంటి మంత్రులు అన్ని రాష్ర్టాల్లో ఉండాలి. హ్యాట్సాఫ్ సర్.. మీలాంటివారు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉండాలి.
-షాహబ్ జాఫ్రి, న్యూఢిల్లీ
‘అద్భుతం.. నాయకత్వం, వినయం విడదీయరానివని నిరూపించారు. మీరొక అసాధారణ వ్యక్తిగా నిలిచారు.
–ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్
పరిశ్రమలకు తెలంగాణ స్నేహపూర్వక రాష్ట్రం. టీఎస్ఐపాస్ వంటి విధానాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని నాయకత్వం దీర్ఘకాల దృక్పథంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నది.
–దీపాలి గోయెంకా, సీఈవో, వెల్స్పన్
మమ్మల్ని విశ్వసించి, హైదరాబాద్లో పెట్టుబడులకు, విస్తరణకు మాకు సహాయపడినందుకు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు.
మంత్రి కేటీఆర్తో చర్చలు అద్భుతంగా సాగాయి. తెలంగాణ సీఈవోతో చర్చలు జరిపినట్టుగా అనిపించింది.
కేటీఆర్.. మిమ్మల్ని క్లోన్ చేసి మిగతా 28 రాష్ర్టాలకు కూడా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పండి.
–కేంద్ర డీవోపీటీ కార్యదర్శి అరుణ సుందరరాజన్
తెలంగాణ ఏర్పడిననాటి నుంచి మంత్రి కేటీఆర్ నాయకత్వంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక లబ్ధికి వినియోగించడంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.
–బోర్గ్ బ్రాండే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు
నవకల్పనలు, ఐటీఐఆర్.. దేని గురించైనా ఆయన (కేటీఆర్) మాట్లాడేది కండ్లు మూసుకొని జాగ్రత్తగా వింటే.. ఆయన ఒక మంత్రి అని నమ్మలేం. లాస్ ఏంజిల్స్ నుంచో, స్టాన్ఫర్డ్ నుంచో, ఇంకెక్కడినుంచో వచ్చిన టెక్నోక్రాట్ అనుకుంటాం. నేనూ అలాగే అనుకొన్నాను.
-కైలాశ్ సత్యార్థి, నోబెల్ బహుమతి గ్రహీత. (ఓ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా)
కేటీఆర్ రియల్ హీరో. ఆయన తెలంగాణ కోసం ఎంతో చేశారు. ఆయన నేతృత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించింది.
తెలంగాణ ప్రభుత్వం గత ఆరేండ్లుగా తనదైన విధానాలు, నాయకత్వంతో పెట్టుబడుల ఆకర్షణలో పోటీపడుతున్నది.
తెలంగాణవారికి పరిపాలనే రాదని, వారికి నాయకత్వ లక్షణాలే లేవని ఎద్దేవా చేసినవారికి ఈ కామెంట్లే సమాధానం. తెలంగాణను చూసి దేశమంతా నేర్చుకోవాలని, కేటీఆర్ వంటి మంత్రి మాకూ కావాలని వస్తున్న అభిప్రాయాలే తెలంగాణ విజయానికి నిదర్శనం. మరి రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ఇప్పటికైనా కనువిప్పు అవుతుందా!