నల్లగొండ ప్రతినిధి, మే5(నమస్తే తెలంగాణ) : నకిరేకల్ మున్సిపల్ పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. శుక్రవారం మధ్యా హ్నం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. దీనికి ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ వాకాటి కరుణను ఎన్నికల కమిషన్ నియమించింది. దీని కోసం
అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నకిరేకల్ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాలాజీ వెల్లడించారు. ముందుగా కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత చైర్మన్ ఎన్నిక ప్రక్రియను చేపడతారు. సభ్యులు చేతులెత్తే పద్ధతి ద్వారానే ఇది పూర్తి కానుంది. చైర్మన్ ఎన్నిక అనంతరం సంతకాలు పూర్తికాగానే వైస్ చైర్మన్ ఎన్నికను కూడా వెంటనే నిర్వహిస్తారు. ఇందులోనూ చేతులెత్తే పద్ధతినే
అనుసరిస్తారు. ఈ ఎన్నిక ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ కూడా చేస్తారు. ఇక వేళ శుక్రవారం ఏదైన కారణంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి కాకపోతే వెంటనే శనివారం తిరిగి అదే సమయానికి చేపట్టేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు కూడా కాకపోతే తర్వాత మళ్లీ ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
టీఆర్ఎస్ పరిశీలకుడిగా తక్కెళ్లపల్లి
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక పరిశీలకుడిని నియమించారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావును నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ వార్డు ఎన్నికల్లోనూ తక్కెళ్లపల్లి ఇన్చార్జిగా వ్యవహరించారు. అందుకే ఆయన నకిరేకల్పై పూర్తి అవగాహనతో ఉన్నారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో తక్కెళ్లపల్లి రవీందర్రావు సమన్వయం చేయనున్నారు. గురువారం సాయంత్రానికే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీల్డ్ కవర్తో తక్కెళ్లపల్లి నకిరేకల్కు చేరుకోనున్నారు. రేపు ఉదయం టీఆర్ఎస్ పార్టీ తరుఫున గెలుపొందిన అభ్యర్థులతో భేటీ అవుతారు. అనంతరం పార్టీ అధిష్టానం సూచన మేరకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను నిర్ణయించనున్నారు. ఇందుకు అనుగుణంగా మధ్యాహ్నం మూడు గంటలకు అధికారికంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయ్యేలా పర్యవేక్షించనున్నారు.
రెండు పదవులూ టీఆర్ఎస్కే..
నకిరేకల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకోనున్నది. మొత్తం 20వార్డులకు గానూ 11 వార్డులను టీఆర్ఎస్, 6వార్డులు ఫార్వర్డ్ బ్లాక్, 2 వార్డులు కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు అవసరమైన స్పష్టమైన మెజార్టీ టీఆర్ఎస్కు ఉంది. దీనికి తోడు అవసరమైతే ఎక్స్ అఫీషియో మెంబర్లు కూడా ఉండనున్నారు. ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులను పార్టీ నుంచి నకిరేకల్ మున్సిపాలిటీకి కేటాయించినట్లు తెలిసింది. వీరు నిబంధనల ప్రకారం నేడు తమ ఓటును నమోదు చేసుకోనున్నారు. రేపు మధ్యాహ్నం జరుగనున్న ప్రత్యేక సమావేశానికి హాజరై ఓటింగ్లో పాల్గొంటారు. దీంతో కొత్తగా ఏర్పడిన నకిరేకల్ మున్సిపాలిటీలో తొలి చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి రానున్నాయి.