మద్దతు ప్రకటించిన అర్చక, ఉద్యోగ జేఏసీ
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ను బలపర్చాల్సిన బాధ్యత అర్చకులు, దేవాదాయశాఖ ఉద్యోగులపై ఉందని రాష్ట్ర అర్చక సమాఖ్య గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చక, ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ రవీంద్రాచార్యులు, జేఏసీ నేత కృష్ణమాచారి పేర్కొన్నారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ శాఖ ఉద్యోగులు రుణపడి ఉంటారని బుధవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అర్చకులు, దేవాదాయ ఉద్యోగులకు అనేక సంక్షేమకార్యక్రమాల అమలుతోపాటు ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏండ్లకు పెంచారని గుర్తుచేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అర్చకులు, దేవాదాయ ఉద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మేలు చేకూర్చుతున్నదని, అందుకే ఆ పార్టీని బలపర్చడం నైతిక బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.