వారణాసి, మే 21: కరోనా మహమ్మారి ఎంతో మంది ఆప్తులను దూరం చేసిందని ప్రధాని మోదీ కంటతడి పెట్టుకొన్నారు. ఎన్నో కుటుంబాలను చిదిమేసిందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబసభ్యుల కండ్ల ముందే ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ నియోజకవర్గ వైద్యులు, నర్సులు, ఫ్రంట్లైన్ వర్కర్లతో మాట్లాడారు. కరోనాను నియంత్రించలేకపోతున్నామన్న నిస్సహాయత ఆయన స్వరంలో స్పష్టంగా కనిపించింది. తన ప్రసంగంలో ఆత్మవిశ్వాసం లోపించింది. ‘మనం కంటికి కనిపించకుండా, ఎప్పటికప్పుడు స్వభావాన్ని మార్చుకొంటూ దాడి చేసే శత్రువుపై పోరాడుతున్నాం.
ఈ మహమ్మారి ఎంత పెద్దదంటే.. వంద కోట్ల మందిమి కలిసి దానిపై పోరాడుతున్నా అది మన కుటుంబసభ్యులను బలితీసుకొంటున్నది. ప్రియమైనవారిని కాపాడుకోలేకపోతున్నాం’ అని బేలగా అన్నారు. కరోనాపై విజయం సాధించామని జనవరిలో ప్రకటించిన మోదీ.. వైరస్ ఇంకా చాలా కాలం పోరాటం చేయాల్సి ఉందని శుక్రవారం చెప్పారు. పిల్లలను రక్షించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కరోనాతో ఏడాది కాలంగా బహుముఖ పోరు జరుపుతున్న సమయంలో బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సవాలు ఎదురు నిలిచిందని ఆందోళన వ్యక్తం చేశారు. దవాఖానలు రోగులతో నిండిపోతుండటంతో ఇంటి దగ్గరే వైద్య సేవలు అందించేలా చర్యలు ప్రారంభించాలన్నారు. ‘ఎక్కడ రోగి ఉంటే అక్కడే వైద్యం’ అన్న నినాదంతో కరోనా రోగులకు చికిత్స అందించటం ద్వారా వైద్య వ్యవస్థపై భారం తగ్గుతుందన్నారు. టెలీమెడిసన్ అవశ్యకతను నొక్కిచెప్పారు. ప్రతి ఒక్కరికి టీకా అందుతుందని చెప్పారు.