సిద్దిపేట : జిల్లాలోని తోగుట మండలం వేములఘాట్ గ్రామంలో తుటుకూరి మల్లారెడ్డి( 70) అనే మల్లన్న సాగర్ ముంపు బాధితుడు ఇంటి ఆవరణలోనే చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపోవడం, అధికారులు ఇంటిని కూల్చేయడం వంటి చర్యలతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడ్డట్లుగా వార్తలు వినవస్తున్నాయి. అయితే ఈ విషాదంపై మృతుడి మనవడు తిరుపతి రెడ్డి స్పందించారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్యాకేజి తమకు పూర్తిగా అందినట్లు తెలిపాడు. తనకు, తన తాతకు కలిపి ప్రభుత్వం అందించే ప్యాకేజీతో పాటు మూట్రాజ్పల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇల్లు సైతం కేటాయించినట్లు వెల్లడించాడు. నెల రోజుల క్రితమే గ్రామం ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిపాడు. తాత కొద్ది రోజులుగా పిడిచేడ్ లో ఉన్న తమ చిన్నమ్మ వద్ద ఉంటున్నాడన్నారు. గురువారం వేములఘట్ గ్రామానికి చేరుకుని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. ఇల్లు పోయిందన్న బాధకు తోడు చిన్నమ్మ దగ్గర ఏమైనా గొడవ జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉందన్నారు.