ధారూరు, జూలై 4: పల్లె ప్రగతితో అంతారం గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గతంలో ఎక్కడ చూసినా మురుగు నీటి కాల్వ లు, మట్టి రోడ్లు, పక్కన గుంతలు, పెంటకుప్పలతో అస్తవ్యస్తంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం తో గ్రామ రూపురేఖలు మారాయి. సర్పంచ్ పట్లోళ్ల నర్సిరెడ్డి ప్రత్యేక చొరవతో ప్రస్తుతం పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నది. రెండేండ్లలో గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి, ఇతర పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ, అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రభుత్వం సూచించిన ప్రత్యేక కార్యాచరణతో ప్రజా ప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలతో పాటు అధికారులు ఉత్సాహంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.
స్వాగతం పలికే హరిత తోరణం
గ్రామంలోని ముఖద్వారం నుంచి రోడ్డుకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. గ్రామంలోని వీధుల్లో సీసీ రోడ్లు, ప్రతి ఇంటి ముందు పచ్చని చెట్టు, రాత్రి వేళల్లో కాంతులు విరజిల్లుతున్న లైట్లు పల్లెకు ప్రత్యేక శోభను తెచ్చాయి. ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనం, నర్సరీ, పంచాయతీ భవనం అందుబాటులో ఉన్నాయి. డంపింగ్ యార్డు, వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఇంటికి వ్యక్తిగత మురుగుదొడ్డి, ఇంకుడు గుంతలతో పల్లె అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నది.
పారిశుద్ధ్య నిర్వహణతో స్వచ్ఛ వీధులు
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామం శుభ్రంగా ఉండాలని పంచాయతీ నిధులతో ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. దీంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
ఆకట్టుకునే హరితహారం నర్సరీ
పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రామంలోని నర్సరీలో 11 వేలు మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలను హరితహారం కార్యక్రమంలో నాటేందుకు సిద్ధం చేశారు. నర్సరీలో టేకు, గుర్భమా, జామ, గచ్చకాయ, కుంకుడు, గులాబీ, మందార, తులసి, గానుగా, కరురా, చింత తదితర మొక్కలు పెంచుతున్నారు. గత హరితహారంలో నాటిన మొక్కలను కాపాడుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నాటిన మొక్కలకు ప్రతి దినం నీరు అందించి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలం, ఖాళీ స్థలం, దేవాలయాల ఆవరణలో, పాఠశాలలో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకుంటున్నారు.
ఆహ్లాదంగా పల్లె ప్రకృతివనం
పల్లె ప్రకృతి వనంలో 4వేలు మొక్కలు నాటి అందంగా తయారుచేశారు. పల్లె ప్రకృతి వనంలో జామ, అల్లనేరేడు, ఆశోక మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలో వాకింగ్ చేసేందుకు ట్రాక్ను ఏర్పాటు చేశారు. గ్రామంలో పురాతన ఇండ్లు, పాడుబడ్డ బావులను పూడ్చేశారు. ఖాళీ స్థలాల్లో పెరిగిన కలుపు మొక్కలు, ముళ్ల కంపను తొలగించి శుభ్రం చేశారు. గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, వ్యక్తి గత మరుగుదొడ్డి నిర్మించుకునేలా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడంతో తాగునీటికి ఇబ్బందులు తప్పాయి. గ్రామంలోనే పుష్కలంగా స్వచ్ఛమైన తాగు నీరు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పల్లె ప్రగతితో గ్రామాభివృద్ధి
గ్రామాభివృద్ధికి 30 రోజుల ప్రణాళికతో ప్రారంభమై అంచలంచలు గా అందరి సహకారంతో అభివృద్ధి కి బాటలు వేశాం. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, అధికారుల సమిష్టి కృషితో అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గ్రామంలోని ప్రతిఒక్కరి సహకారంతో అభివృద్ధి జరిగింది.