మహబూబ్నగర్ : ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీని సహించేది లేదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్ పేరుకు చెప్పుకుంటూ తెలంగాణలో రాజకీయం చేయడానికి వచ్చిన షర్మిలకు కర్ణాటకలో కృష్ణానదిపై అక్రమంగా నిర్మించిన గూగల్ బ్యారేజీ వద్ద పవర్ ప్లాంటు ఉందన్నారు. షర్మిలకు ఆమె తండ్రి ఇచ్చిన బహుమానమే ఆ పవర్ ప్లాంటు అని ఆయన తెలిపారు. ఆ పవర్ ప్లాంటు వల్ల తెలంగాణకు రావాల్సిన 3 టీఎంసీల నీళ్లు మధ్యలోనే ఆగిపోతున్నాయన్నారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్న షర్మిలకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే కృష్ణానది నుంచి నీటి దోపిడి చేస్తున్న ఆమె సోదరుడు ఏపీ సీఎం జగన్ పై పోరాటం చేయాలని సూచించారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే అక్రమంగా కృష్ణా జలాలను తరలిస్తున్న ఏపీ సర్కారు… ఇప్పుడు ఏకంగా నదినే మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని దీనిని ముమ్మాటికి సహించేది లేదని హెచ్చరించారు.
కృష్ణాజలలా దోపిడీకి తెర తీసిన ఏపీ సీఎం జగన్ తీరుపై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిట్టెం మాట్లాడారు. తెలంగాణకు వైఎస్ మొదటి నుంచి బద్ధ శత్రువు అని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు మన ఎమ్మెల్యేలపై వెటకారంగా మాట్లాడి తన బుద్ధిని చూపించారని గుర్తు చేశారు. అప్పుడు తండ్రి నీటి దోపిడిని ప్రారంభిస్తే ఇప్పుడు కుమారుడు కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు. తెలంగాణలో జలయజ్ఞం పేరిట మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నారే కానీ ఇక్కడి ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదని వైఎస్ తీరును తూర్పారపట్టారు.
సీఎం కేసీఆర్ ముందుచూపు వల్ల ఇప్పుడిప్పుడే పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో లేక లేక సుమారు 9 లక్షల ఆయకట్టు పండించుకుంటున్నామని, యాసంగిలో కనీవినీ ఎరుగని పంట వచ్చిందన్నారు. తెలంగాణలో మంచి పంటలు పండుతుంటే ఏపీ నాయకుల కండ్లు మండుతున్నయని రామ్మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వాళ్లు బతకవద్దా… సీమాంధ్ర వాళ్లే బతకాలా… అని ఏపీ సర్కారు తీరును ప్రశ్నించారు. సీఎం కేసీఆర్… ఏపీ సీఎం జగన్ ను ప్రేమతో దగ్గర తీస్తే జగన్ మాత్రం తన వక్ర బుద్ధి చూపించి కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టులకు తెర తీశాడన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కోసమే ఏర్పాటు చేశారనే విషయాన్ని మర్చిపోయి మొత్తం నీటిని అక్రమంగా రాయలసీమకు తరలిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి ఒక్క నీటి బొట్టు కూడా పోనివ్వమని అంటున్న షర్మిల… జగన్ పై పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజలంతా ఏకకంఠంతో ఏపీ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారని… ఇలాగే చేస్తే తగిన బుద్ధి చెపుతారని రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కృష్ణానదిపై ఆధారపడి ఉందని మన హక్కు నీటిని అక్రమంగా తరలించుకుపోతుంటే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరన్నారు. కృష్ణానది నుంచి అక్రమ నీటి తరలింపును వెంటనే ఆపకుంటే జగన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తదన్నారు. అభివృద్ధిలో జగన్… సీఎం కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోడన్నారు. సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అతి తక్కువ కాలంలో 19 జిల్లాలకు సాగునీరు అందించి చరిత్ర సృష్టించాడని… జగన్ మాత్రం చేసిందేమీ లేదన్నారు. ఏపీలో అభివృద్ధి చేయలేకపోయినా వివాదాలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడని చిట్టెం అన్నారు.