హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రాజకీయాలు లేకున్నా పర్వాలేదు.. ప్రాణాలు పోయినా లెకచేయం. కానీ పాలమూరుకు నీటిగోస రానివ్వబోమని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న పాలమూరును ఎండబెడతామంటే ఎక్కడిదాకా వెళ్లయినా పోరాడతామని స్పష్టంచేశారు. తాము కడుపు మండి మాట్లాడితే ఆంధ్రా నేతలకు ఉలుకెందుకని ప్రశ్నించారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, అంజయ్యయాదవ్, వెంకటేశ్వర్రెడ్డి, నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే తమ బతుకులు బాగుపడతాయని అన్నదాత ఆశలు పెట్టుకొన్నారని, అంతలోనే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలతో వారి ఆశలను అడియాసలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుదుత్పత్తి కోసం నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టుగా మార్చేలా కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు.. ఏపీ ప్రభుత్వం ఎలా చెప్తే అలా తలూపుతున్నదని ఆరోపించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టుపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించిందని, ఆ స్టేను అమలుచేసే బాధ్యత కృష్ణాబోర్డుది కాదా? అని ప్రశ్నించారు. ఏపీ పాలకులు మొండిగా వ్యవహరిస్తే ఊరుకొనేది లేదని, ఆంధ్రా జలదోపిడీని సహించలేకనే తెలంగాణ కోసం ఉద్యమించామని గుర్తుచేశారు. ప్రత్యేక రాప్ట్రంలో ప్రశాంతంగా జీవిస్తున్న సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఏపీ పాలకుల దుర్మార్గాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా ఉండాలనేదే తమ ఆకాంక్ష అన్నారు. కానీ ఏపీ నేతలు అందుకు విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని హితవుపలికారు. సమైక్య పాలకులు తెలంగాణకు చేసిన అన్యాయంపై వందేడ్లయినా మాట్లాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల సాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరంచేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని ప్రపంచమంతా కీర్తిస్తున్నదని పేర్కొన్నారు.
దగాపడ్డ పాలమూరును కాపాడుకుంటాం:ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
సమైక్య పాలనలో దగాపడ్డ పాలమూరును సీఎం కేసీఆర్ నాయకత్వంలో సస్యశ్యామలంగా మార్చుకొంటున్నామని ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో పాలమూరును రన్నింగ్ ప్రాజెక్టుల జిల్లాగా మారుస్తున్నారని చెప్పారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయని ఆశిస్తున్న తరుణంలో ఏపీ అక్రమ ప్రాజెక్టులు తమ జిల్లాకు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. కలిసికట్టుగా పోరాడి జలహక్కులను కాపాడుకొంటామన్నారు. పాలమూరులో కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నా సమైక్య పాలకులు కరువుజిల్లాగా మార్చారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. ఆవేదనలో నుంచే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామని.. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు. ఏపీ దురాలోచనతో తమకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ దుర్మార్గ విధానంపై వైఎస్ షర్మిల వైఖరి ఏమిటో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా అక్రమంగా నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై పార్లమెంట్లోనూ నిలదీస్తామని ఎంపీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.