హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసే అలోచనలో అధికారులున్నారు. లాక్డౌన్తో ఎక్కడి ప్రజలు అక్కడే ఆగిపోతారు. రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయడానికి ఆస్కారం ఉంటుంది. అవసరమైతే ప్రత్యేక పర్మిషన్లు తీసుకొని నిర్మాణ పనులు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నిర్మాణ ప్రాంతాల్లోనే కూలీలు గుడారాలు వేసుకొని ఉంటున్నారు. వారికి కావాల్సిన రేషన్ సిద్ధంగానే ఉన్నది. ఆంక్షల సడలింపు సమయంలో కూరగాయలు, ఇతరత్రా కొనుక్కొనేందుకు అవకాశముంటుంది. మిగతా సమయమంతా సైట్లోనే ఉంటారు కనుక పనులు వేగంగా పూర్తిచేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు
సచివాలయం నిర్మాణ పనులు కూడా నిరాటంకంగా కొనసాగించనున్నారు. ఇప్పటికే కావాల్సిన మెటీరియల్ను నిర్మాణ ప్రాంతానికి తెప్పించుకున్నారు. కార్మికులు కూడా సైట్లోనే ఉన్నారు. వారితో పనులు సాఫీగా చేయనున్నారు. దీంతో సచివాలయ నిర్మాణ పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని అధికారులు భావిస్తున్నారు. ఉన్న సామగ్రితో పనులు చేస్తామని, లాక్డౌన్ నిబంధనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఈఎన్సీ గణపతిరెడ్డి తెలిపారు.