దొంగ ప్రాజెక్ట్లు కట్టింది.. కడుతున్నదీ వాళ్లే
జగన్ వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట టౌన్, జూలై 9: కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటాను వదులుకునే ప్రసక్తేలేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆంధ్రా సర్కార్ దుర్మార్గాన్ని ముమ్మాటికీ ఎండగట్టి తీరుతామన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు ఆయన అపరిపక్వతను బయట పెడుతున్నాయని దుయ్యబట్టారు. వారు చేస్తున్న మోసాలకు ఆ మాటలే అద్దం పడుతున్నాయని ఆరోపించారు. శుక్రవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. లేని హక్కులు ఉన్నట్టు చూపిస్తున్నారని మండిపడ్డారు. గతంలో దొంగ ప్రాజెక్టులు నిర్మించింది వారేనని.. ఇప్పుడు నిర్మిస్తున్నది కూడా వాళ్లేనని విమర్శించారు. సమైక్య పాలననలో తెలంగాణ మంచినీళ్ల కోసం అలమటించిందన్నారు. చంద్రబాబు నుంచి వైఎస్ రాజశేఖర్రెడ్డి వరకు తెలంగాణకు ద్రోహం తలపెట్టిన వారేనని, ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో పయనిస్తున్నారన్నారు. పలువురు నాయకులుస్టంట్ మాస్టర్లలా వ్యవహరిస్తున్నారని, అటువంటి స్టంట్లన్నీ కెమెరాలకే పరిమితమని మంత్రి ఎద్దేవా చేశారు.