జయశంకర్ భూపాలపల్లి : సీఎం కేసీఆర్ ఏ లక్ష్యంతో హరితహారం ప్రారంభించారో.. ఆ లక్ష్యం ఫలాలు నేడు మన అనుభవంలో ఉన్నాయని గరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హరితహారం, నాలుగో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణం, ఒడితెల, చిట్యాల, జూకల్లో పర్యటించి ఎంపీ దయాకర్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ జక్కుల హర్షినితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణలో చిన్నచిన్న పల్లెల్లో కూడా హరితహారం ఫలితం వల్ల పచ్చదనం వెల్లివిరుస్తుందన్నారు.
దళితులు ఈ సమాజంలో అందరితో పాటు సమానంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ 1200 వందల కోట్ల రూపాయలతో దళిత క్రాంతి పథకాన్ని తీసుకొస్తున్నారు. గతంలో మున్సిపాలిటీలు అంటే మురికి కూపాలకు మారుపేరుగా ఉండేవి. కానీ డైనమిక్ లీడర్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో అద్భుతమైన ప్రణాళికతో మున్సిపాలిటీలు అన్నీ అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని తెలిపారు.
భూపాలపల్లి, ములుగు ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి ఉన్న ప్రాంతాలు. కానీ కొన్ని కారణాల వల్ల నేడు అడవులు తగ్గిపోయాయి. మళ్లీ హరితహారం కార్యక్రమం ద్వారా పూర్వ వైభవం తీసుకొద్దామన్నారు. అలాగే భూపాలపల్లిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు.
హరితహారం కార్యక్రమంలో ప్రజలకు ఉపయోగపడే పండ్లు, పూలు, కూరగాయల మొక్కలు ఇవ్వాలని మంత్రి సూచించారు. ఒడితెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లో భాగంగా గ్రామంలో, పట్టణంలో పర్యటించి స్థానిక అవసరాలను తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
చెరువులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్