కరీంనగర్ : స్వయం పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం 42 ,11 వ డివిజన్ లలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. హరితహారంలోభాగంగా మొక్కలు నాటారు. వంగిపోయి రోడ్డుమధ్యలో ఉన్న స్తంభాలు తొలిగించే కార్యక్రమానికి కొబ్బరికాయకొట్టి పనులు ప్రారంభించారు. 11 డివిజన్ లోని పార్క్ను సందర్శించారు. అనంతరం హరిహరనగర్ కాలనీ రోడ్డులో రూ.22 లక్షల మున్సిపల్ నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత 50 సంవత్సరాలుగా అభివృద్ధి కోసం నిధులు రాక సమస్యలు అలాగే పేరుకుపోయాయన్నారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతితో నేరుగా ప్రభుత్వం నుంచి నిధులు వస్తూ పట్టణాలకు ధీటుగా పల్లెలు అభివృద్ది చెందుతున్నాయన్నారు.
పట్టణాలు మరింత ఆధునీకరణ చెందుతున్నాయని పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులకు ప్రజలు సహకరించాలన్నారు. హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతి వల్లూరు,డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్తో హెల్త్ సూపర్ వైజర్ మృతి