హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రికార్డుల పరంపర కొనసాగుతున్నది. మేడిగడ్డ నుంచి మొదలైన గంగమ్మ.. కొండపోచమ్మసాగర్ వరకు అలుపులేకుండా ఎదురు ప్రయాణం చేస్తున్నది. సుమారు 250 కిలోమీటర్లు సజీవ జలధారను తలపిస్తున్నది. ప్రాజెక్టు నుంచి ఏడాదిన్నరలో 100 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోయగా.. అతి త్వరలో నిజాంసాగర్కు సైతం నీళ్లు చేరబోతున్నాయి. ప్రాజెక్టులో కీలకమైన మల్లన్నసాగర్ పనులు జూన్ నాటికి పూర్తికానున్నాయి. మల్లన్నసాగర్ జూలైలో గోదావరి జలాలతో మురిసిపోనున్నది. మరోవైపు కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పైపైకి ఉబికివస్తున్నాయి. ఒకప్పుడు నాలుగైదు వందల అడుగుల లోతున కూడా నీళ్లు పడనిచోట.. ఇప్పుడు వంద అడుగులలోపే కనిపిస్తున్నాయి.
గోదావరి జలాలు సుమారు 250 కిలోమీటర్లు ఎదురెక్కి.. అరకిలోమీటర్ ఎత్తుపై ఉన్న కొండపోచమ్మ సాగర్లోకి దుంకాయి. లక్ష్మి, సరస్వతి, పార్వతి బరాజ్లు కళకళలాడుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మసాగర్ వరకు కాలువలు నీటితో తొణికిసలాడుతూ తెలంగాణ గడ్డపై సజీవ జలధార ఆవిష్కృతమవుతున్నది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరద కాలువల ద్వారా 90 టీఎంసీలను తరలించే అవకాశం లభించింది. ఇప్పటికే స్టేజ్-1, స్టేజ్-2కు నీటిని తరలించారు. ఫలితంగా ప్రాజెక్టు కింద ఉన్న 14 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.
సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఈ ఏడాది జూన్నాటికి పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. జూలైలో నీటిని నింపే ప్రక్రియ చేపడుతామని, తొలిదశలో 10 టీఎంసీలను నిం పుతామని పేర్కొన్నారు. దీంతో 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోగలిగే రిజర్వాయ ర్ అందుబాటులోకి రానున్నది. వారం పది రోజుల్లో సంగారెడ్డి కాలువ ద్వారా నిజాంసాగర్కు నీళ్లు ఇస్తామని, ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి హల్దివాగు, సంగారెడ్డి కాలువ ద్వారా నిజాంసాగర్ వరకు నీటిని తరలించనున్నట్టు వెల్లడించారు. నిజాంసాగర్కు నీటిని తరలించడం ద్వారా మంజీరాతో గోదావరి అనుసంధానం జరిగినట్టవుతుందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మి, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంప్హౌస్లు సగటున 100 టీఎంసీల నీటిని ఎత్తిపోశాయి. ఒక టీఎంసీ అంటే సుమారు 2,831 కోట్ల లీటర్ల లెక్కన.. కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు సేకరించిన నీటి పరిమాణం సుమారు 2.85 లక్షల కోట్ల లీటర్లు. గతంలో గోదావరి నుంచి తెలంగాణ ప్రాంతానికి నీటిని సేకరించాలంటే ఎస్సారెస్పీ మాత్రమే దిక్కుగా ఉండేది. దీని సామర్థ్యం 90 టీఎంసీలు. అయినా ఎప్పుడూ 30-40 టీఎంసీలకు మించి నీళ్లు వచ్చేది కాదు. ఈ లెక్కన 100 టీఎంసీలు సేకరించాలంటే మూడేండ్లు పట్టేది. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడాదిన్నరలోనే వాటిని సేకరించారు.
ఒకప్పుడు ఉమ్మడి మెదక్ తాగడానికి కూడా నీళ్లు దొరకని జిల్లాగా ఉండేది. భూగర్భ జలాలు పాతాళంలో ఉండేవి. కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లా స్వరూపమే మారిపోయింది. రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్.. ఇలా కాళేశ్వరంలోని కీలక రిజర్వాయర్లకు ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంగా మారింది. అంతేకాదు.. సింగూరు, నిజాంసాగర్ రిజర్వాయర్లకు నీళ్లు రానున్నాయి. ఇప్పటికే రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా అనేక చెరువులు నిండాయి. ఎస్సారార్ నుంచి కొండపోచమ్మ వరకు ఇప్పటికే దాదాపు 400 చెరువులు పూర్తిగా నిండాయి. 88 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందాయి. ప్రస్తుతం రంగనాయక సాగర్ నుంచి నీళ్లు విడుదల చేస్తుండటంతో ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి.