హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం.. ఇదొక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్ర తలరాతనే మార్చిన వరప్రదాయిని. వర్తమానంలో రికార్డులను తిరుగరాస్తూ.. భవిష్యత్తులో రాష్ట్ర ప్రజల జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చే శక్తి ఉన్న బహుళార్థక సాధక ప్రాజెక్టు. సర్వే చేయడం దగ్గర్నుంచి ప్రతి దశలోనూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న ఒక బాహుబలి ప్రాజెక్టు. మనిషి.. మెషిన్ కలిసి సృష్టించిన ఒక అద్భుత నిర్మాణంపై చిత్రీకరించిన డాక్యుమెంటరీని ప్రఖ్యాత డిస్కవరీ చానల్లో ఇటీవలే ప్రసారం చేయడంతో కాళేశ్వరం ఘన చరిత్రతోపాటు దాని వెనుకున్న సైన్స్, ఇంజినీరింగ్ ప్రతిభ ప్రపంచవ్యాప్తం అయ్యింది. సీఎం కేసీఆర్ కలగన్న జల తెలంగాణను నెరవేర్చుతున్నది. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న తాగు,సాగునీటి సమస్యలను 70 శాతం తీర్చుతున్నది. అంతేకాదు.. ఇన్నాళ్లూ భారీ ఎత్తిపోతల పథకాలంటే అమెరికాలోని కొలరాడో, ఈజిప్ట్లోని గ్రేట్ మెన్ మేడ్ రివర్ వంటి ప్రాజెక్టుల గురించి చెప్పుకొనేవారు. ఇకపై అందరూ కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిపారుదల రంగంలో రికార్డుల రారాజుగా నిలిచింది. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రఖ్యాత ఇంజినీరింగ్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐల్) భాగమైంది.
బహుళ ప్రయోజనాలు
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలను మించి ముందుకు సాగుతున్నది. నీళ్లను ఎత్తిపోయడమే కాదు.. ప్రజల జీవన విధానాన్ని, రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేస్తున్నది. ఒకప్పుడు ఎండిపోయిన గోదావరిలో ఇప్పుడు జీవకళ రావడంతో పడవలు తిరుగుతున్నాయి. ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన జలాశయాలన్నీ పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. కొత్తగా రిజర్వాయర్లు రావడం, గోదావరి నీటితో చెరువులను నింపడంతో మత్స్య సంపద కనీసం మూడు రెట్లు పెరిగింది. మత్స్యకారులకు ఆర్థికంగా అండగా నిలిచింది. కాళేశ్వరం జలాల ఫలితంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగడమే కాదు.. ధాన్యం దిగుబడిలో రికార్డులు సృష్టిస్తున్నాం. దీంతో రైతు ఇంటికి ధాన్యలక్ష్మి.. జేబుల్లోకి ధనలక్ష్మి వస్తున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల ఉద్యోగాల సృష్టి జరిగింది. రాష్ట్ర నీటిపారుదల రంగం ముఖచిత్రమే మారిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక ఎత్తిపోతల పథకాలను నిర్వహిస్తున్న విభాగంగా నిలిచింది. అత్యధిక సామర్థ్యం ఉన్న ఎత్తిపోతల నిర్వహణలో (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) ప్రపంచానికి దిక్సూచిలా నిలిచింది.
కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి, దాని ఉపనదులకు జీవకళను తెచ్చిపెట్టింది. దుమ్ముగూడెం నుంచి శ్రీరాంసాగర్ వరకు సుమారు 274 కిలోమీటర్ల పొడవున గోదావరి నదిలో ఎల్లకాలం నీరు నిల్వ ఉంటున్నది. మరోవైపు మేడిగడ్డ నుంచి ఎదురెక్కడం ప్రారంభించే గోదావరి కొండపోచమ్మసాగర్ వరకు అనేక రిజర్వాయర్లను నింపుతూ, కాలువల్లో పారుతూ తెలంగాణ ఎదపై సుమారు 250 కిలోమీటర్ల మేర సజీవ జలధారను ఆవిష్కరించింది. తాజాగా కొండపోచమ్మసాగర్ నుంచి 96 కిలోమీటర్లు ప్రయాణించి ఉపనది మంజీరతో కలిసింది. నిజాంసాగర్కు, సింగూరుకు జవసత్వాలను తీసుకొచ్చింది.