నిజామాబాద్ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
సోమవారం ఆయన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, సంబంధిత గుత్తేదారులు, అధికారులతో కలిసి సారంగాపూర్ , మంచిప్ప, గడ్కోల్, మెంట్రాజ్ పల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాలలో పైపులైన్ల పనులు, కాల్వల పనులు, పుప్పాలపల్లి దగ్గర అంతర్గత పైప్ లైన్ నీటి పంపింగ్ ను పరిశీలించారు.
సికింద్రాపూర్ మెయిన్ లైన్ పనులకు నేషనల్ హైవే అడ్డు ఉండడంతో NH అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. వర్క్ ఏజెన్సీ తో మాట్లాడి పైప్ లైన్ పూర్తి చేసి రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పడ్కల్ మెయిన్ లైన్, కలిగోట్ మెయిన్ లైన్, కప్పలవాగు మీద చెంగల్, బడా భీంగల్ మెయిన్ లైన్లు క్రాసింగ్ పనులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీరు సదుపాయం లేని నిజామాబాద్ రూరల్ , ఆర్మూర్, బాల్కొండ , మెట్పల్లి నియోజకవర్గాల పరిధిలోని మంచిప్ప, గడుకోల్, సిరికొండ , డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్ మండలాలు.. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్, మోర్తాడ్, భీమ్గల్ తదితర మండలాల్లోనూ, ఆర్మూర్ నియోజకవర్గం లోని జక్రాన్ పల్లి మండలంలో, మెట్పల్లి నియోజకవర్గంలోనూ అన్నింటా కలిపి రెండు లక్షలపైగా ఎకరాలకు నీరు అందించడానికి పనులు వేగవంతం చేయడంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని తెలిపారు.
బినోల నుంచి ఎస్పారెస్పీ వెనుక భాగంలో టన్నెల్ ద్వారా నీరు తెచ్చి మాసాని దగ్గర నిజాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ వద్ద లిఫ్ట్ చేసి అక్కడి నుంచి మెంట్రాస్పల్లి పంప్ హౌస్ కు పంపింస్తారని వివరించారు. ప్యాకేజీ 21 జులై కల్లా పూర్తి చేయించడానికి అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్ట్ పనులకు రైతులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.