హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: అల్పపీడన ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకొంటున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర, ఉజ్జయిని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారటంతో దిగువకు పరవళ్లు తొక్కుతున్నది. శుక్రవారం సాయంత్రం జూరాల ప్రాజెక్టుకు 63,400 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. అక్కడి నుంచి శ్రీశైలం దిశగా జలాలు పరుగులు తీస్తున్నాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని మూసీ ప్రాజెక్టు ఆరు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. కర్ణాటకలోని తుంగ, భద్ర పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది.
శ్రీరాంసాగర్కు తగ్గిన ఇన్ఫ్లో
గత కొన్ని రోజులుగా భారీ ఇన్ఫ్లోలు నమోదైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శుక్రవారం వరద తగ్గుముఖం పట్టింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 53 టీంఎసీల జలాలు చేరాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్కు ఇన్ఫ్లో పెరిగింది. 6,346 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవ్వగా, ప్రాజెక్టులో 7.42 టీఎంసీలు నీరున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీబరాజ్కు 57,240 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 24 గేట్లను ఎత్తి 41,670 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం బరాజ్లో 9.166 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. సరస్వతి బరాజ్లో 07.48 టీఎంసీల నీళ్లున్నాయి. కాళేశ్వరంలోని పుష్కరఘాట్ వద్ద 6.90 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దుంకుతూ దిగువకు పరవళ్లు తొక్కుతున్నది.
నేడు, రేపు మోస్తరు వానలు
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదివారం, సోమవారాల్లో ఒకటి, రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.