జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా? ఆవిరి పడితే వైరస్ లోపలికి వెళ్తుందంట కదా, నిజమేనా? కండ్ల ద్వారా వైరస్ సోకుతుందా? తదితర అనుమానాలను కోఠి ప్రభుత్వ ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ టీ శంకర్ నివృత్తి చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధానాలను ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.
జలుబు, దగ్గు వంటి లక్షణాలున్నపుడు పసుపు,ఆకుపచ్చని ట్యాబ్లెట్లతో ఆవిరి పట్టడం మంచిదే. ఆవిరి వల్ల ముక్కులో, గొంతులో, శ్వాస నాళాల్లో చేరిన వైరస్లు ఏవైనా అంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనిపై పలువురు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నా ఆవిరి పట్టడం మంచిదే.
కరోనా సోకిన వారిలో మొదట జ్వరం, ముక్కు, గొంతుకు సంబంధించి లక్షణాలు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటివి కనిపిస్తాయి. 4, 5 రోజుల తర్వాత వాసన తెలియకపోవటాన్ని చాలామందిలో గుర్తిస్తున్నారు. కరోనా సోకిన వారం తర్వాత వాసన సాధారణ స్థితికి వస్తుంది. వాసన పోయిందని చెప్తున్నవారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. గొంతులో నొప్పి, గొంతు గరగర, ఇతర వ్యాధి లక్షణాలున్నట్టు అనిపిస్తే టెస్ట్ల కోసం పరుగెత్తకుండా వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు టెస్ట్లు చేయించుకోవాలి. మందులు వాడాలి. శ్వాస తీసుకోవటంలో తేడాలుంటే మాత్రం దవాఖానలో చేరాలి.
భయం మనిషిని కుంగదీస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి బయట పడేందుకు జాగ్రత్తలతో పాటు ధైర్యం కూడా చాలా అవసరం. రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. భౌతికదూరం పాటిస్తూ, మాస్కు ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను సబ్బు లేదా శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తప్పనిసరి చేయించుకోవాలి.
హైదరాబాద్ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ