హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగునీటి వసతి పెరగడంతో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు అనుగుణంగా రాష్ట్రంలో కోటి టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం ఆయన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్డబ్ల్యూసీ) డైరెక్టర్ల బోర్డు సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తెలంగాణలోని గోదాముల సామర్థ్యం కేవలం 4 లక్షల టన్నులేనని, ప్రస్తుతం రాష్ట్రంలో 65.40 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములున్నాయని వివరించారు. కొత్తగా 40 లక్షల టన్నుల సామర్థ్యం పెంపునకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారని తెలిపారు. టీఎస్డబ్ల్యూసీ చైర్మన్ మందుల సామేల్, ఎండీ జితేందర్రెడ్డి, డైరెక్టర్లు ఆర్ఆర్ అగర్వాల్, అజయ్ జాదూ, ముత్తురామన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.