హైదరాబాద్ : సివిల్స్ – 2020 ఫలితాల్లో వరంగల్ అమ్మాయి సత్తా చాటింది. తొలి ప్రయత్నంలోనే పి శ్రీజ 20వ ర్యాంకు సాధించి, ఆదర్శంగా నిలిచింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సమాజ సేవ చేయడమే లక్ష్యంగా సివిల్స్ను ఎంచుకున్నానని శ్రీజ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
మొదటి ప్రయత్నంలోనే 20వ ర్యాంకు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. మంచి ర్యాంకు వస్తుందని అనుకున్నాను. కానీ 20వ ర్యాంకు వస్తుందని అసలు ఊహించలేదు. సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడే హైదరాబాద్ వచ్చాను. నా చదువంతా హైదరాబాద్లోనే కొనసాగింది. పదో తరగతి వరకు రఘునాథ మోడల్ హైస్కూల్లో, ఇంటర్ శ్రీచైతన్య కాలేజీలో, ఎంబీబీఎస్ ఉస్మానియా కాలేజీలో 2019లో పూర్తి చేశాను.
నాన్న శ్రీనివాస్ హైదరాబాద్లోని ఓ హోండా షోరూమ్లో సీనియర్ సేల్స్ మేనేజర్గా పని చేస్తున్నారు. అమ్మ లత జనగామ జిల్లాలో నర్సుగా పని చేస్తున్నారు. తమ్ముడు సాయిరాజ్ గ్రాడ్యుయేట్ చదువుతున్నాడు.
నాన్న ప్రోత్సహంతోనే సివిల్స్ వైపు దృష్టి పెట్టాను. నాన్న చాలా సపోర్ట్ చేశారు. సివిల్స్కు ప్రిపేర్ అవుతూనే చాలా సినిమాలు చూశాను. ప్రతి విషయంలో పూర్తి స్థాయిలో చర్చించి, విషయ పరిజ్ఞానం సంపాదించుకునేదాన్ని.
సివిల్స్ కోచింగ్, ఇంటర్వ్యూ విషయంలో నన్ను ఎంతో ప్రోత్సహించిన రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సార్, బాలలత మేడమ్కు ప్రత్యేక ధన్యవాదాలు. యూపీఎస్సీ సిలబస్ చాలా నచ్చింది. ఇష్టపడితే కష్టం కాదు అనేది నేర్చుకున్నా. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ సమయంలో చాలా కష్టపడ్డాను. హైదరాబాద్లోనే కోచింగ్ తీసుకున్నాను. ఇంటర్వ్యూ హెల్త్ అంశాలపైనే కొనసాగింది అని శ్రీజ తెలిపారు.