కరీమాబాద్ : కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. బీడి పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తున్న వారి పిల్లల చదువుల కోసం ప్రభుత్వం ఏటా ఉపకార వేతనాలు (స్కాలర్షిప్)లను అందిస్తున్నది. దీనిపై సరిగా అవగాహన లేకపోవడంతో చాలా మంది దరఖాస్తులు చేసుకోలేక పోతున్నారు. ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 15 నవంబర్ 2021 వరకు గడువు ఉంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 2021 నవంబర్ 30వరకు గడువు ఉంది. ఈ లోగా అర్హులు www.scholarship.gov.in నందు వారి వవరాలు నమోదు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు మెయిల్ ఐడీ helpdesk@nsp.gov.in 0120-6619540 సంప్రదించవచ్చు.
దరఖాస్తుకు అర్హులు
కార్మిక రంగంలో పని చేస్తున్న బీడి కార్మికులు, లైమ్స్టోన్, డోలమైట్, మైకా, మాంగనీస్, సినీ పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తున్న వారి పిల్లలు స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రి మెట్రిక్, 11వ తరగతి నుంచి వృత్తి విద్య, డిగ్రీ, పీజీ కోర్సులకు సంబందించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు గత విద్యా సంవత్సరానికి సంబందించి ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైతం వర్తింపు
ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న కార్మికుల పిల్లలకు సైతం స్కాలర్షిప్లకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అందుకోసం విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఆధార్కార్డు, విద్యార్థి పేరున ఉన్న బ్యాంకు అకౌంట్ గత సంవత్సరం ఉత్తీర్ణత సాధించిన పత్రం సమర్పించాలి.
దరఖాస్తు చేసుకోవాలి
డాక్టర్ సురేష్ కుమార్, వైద్యాధికారి కార్మికశాఖ ఆసుపత్రి, కరీమాబాద్
కార్మికులుగా పని చేస్తున్న వారు పిల్లలకు స్కాలర్షిప్ను తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం అందించే స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఏటా కార్మికుల పిల్లలకు కార్మిక సంక్షేమశాఖ స్కాలర్షిప్లను అందిస్తుంది. కార్మికులకు సందేహాలు ఉంటే 040-24658026 నంబర్ను గానీ, కరీమాబాద్లోని బొమ్మలగుడి వద్ద ఉన్న బీడి కార్మికుల ఆసుపత్రిలో గానీ సంప్రదించాలి.