హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన వరంగల్ మల్టీ సూపర్స్పెషాలిటీ దవాఖాన డిజైన్లను రోడ్లు, భవనాలశాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. బుధవారం ఎర్రమంజిల్లోని కార్యాలయంలో దవాఖాన నిర్మాణం, బిల్డింగ్ డిజైన్పై ప్రముఖ ఆర్కిటెక్ట్లు, వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన అమేయ డిజైన్, ఢిల్లీకి చెందిన ఆరాప్ ఆరిటెక్ట్స్, నోయిడాకు చెందిన డిజైన్ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్లు రూపొందించిన పలు డిజైన్లను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా మంత్రి స్వల్ప మార్పులను సూచించారు. 28లోగా మార్పులతో దవాఖాన డిజైన్స్, ఎలివేషన్లతో కూడిన ప్లాన్స్ సీఎం కేసీఆర్కు సమర్పించాలని మంత్రి వేముల ఆదేశించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్లో మ్యూజియం
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం రెండు నెలల్లో పూర్తి కావాలని వర్క్ ఏజెన్సీని, అధికారులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సెంటర్ నిర్మాణ పనుల పురోగతిపై డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఆర్అండ్బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పే వివరాలు, రాష్ట్రం సాధించిన విజయాలు, పోలీస్శాఖ వివరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రముఖ మ్యూజియం నిర్మాణ నిపుణుడు వసీంఖాన్కు చెందిన భాగస్వాముల ఆధ్వర్యంలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.