వరంగల్, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ గుబాలించింది. వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్లో 48 డివిజన్లను కైవసం చేసుకొని తనకు ఎదురులేదని నిరూపించుకొన్నది. ప్రతిపక్ష పార్టీలను చిత్తుచేస్తూ రెండోసారి వరంగల్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటున్నది. గ్రేటర్ వరంగల్లోని 66 డివిజన్లలో 48 చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. 10 డివిజన్లలో బీజేపీ, 4 చోట్ల కాంగ్రెస్ గెలిచాయి. టీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేసిన నలుగురు గెలిచారు. వరంగల్ నగరానికి గ్రేటర్ వరంగల్ హోదా వచ్చిన తర్వాత మొదటిసారి 2016లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. ఇప్పుడూ అదే తీరుగా ఘన విజయాన్ని నమోదు చేసింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 24 డివిజన్లలో టీఆర్ఎస్ 20, బీజేపీ 2, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలిచాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 26 డివిజన్లలో టీఆర్ఎస్ 16, కాంగ్రెస్ 4, బీజేపీ 4, స్వతంత్రులు 2 డివిజన్లలో గెలిచారు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని 13 డివిజన్లలో టీఆర్ఎస్ 9, బీజేపీ 4 డివిజన్లలో గెలిచాయి. పరకాల నియోజకవర్గంలోని మూడు డివిజన్లను టీఆర్ఎస్ గెలుచుకున్నది.