వరంగల్ : వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. జైలు నుంచి మొత్తం 970 మంది ఖైదీలను హైదరాబాద్ చర్లపల్లి జైలుతో పాటు ఇతర జైళ్లకు తరలించనున్నారు. ఇవాళ 104 మంది ఖైదీలను చర్లపల్లి, చంచల్గూడ, మహబూబాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ జైళ్లకు తరలించారు. ఈ ఖైదీల్లో దోషులుగా తేలిన 75 మంది ఖైదీలు, 39 మంది అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ మాట్లాడారు. ఖైదీల తరలింపు ప్రక్రియ మరో 15 రోజుల్లో పూర్తి కానుంది అని తెలిపారు. ఖైదీల తరలింపు పటిష్ట బందోబస్తు మధ్య జరుగుతుందన్నారు. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేది జెండా ఊపి ఖైదీల తరలింపు వాహనాలను ప్రారంభించారు.
సెంట్రల్ జైలు స్థలంలో ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జైలు స్థలాన్ని వైద్యారోగ్య శాఖకు కేటాయించాలని మంత్రివర్గం కూడా నిర్ణయించింది. జైలు నిర్మాణం కోసం వరంగల్ శివారులో మరో స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది.