తొలిరోజు వేర్వేరు జైళ్లకు 114 మంది
వరంగల్, జూన్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ సెంట్రల్ జైలులోని ఖైదీల తరలింపు ప్రక్రియ మొదలైంది. గత నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం సందర్శన సందర్భంగా సెంట్రల్ జైలు స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. సీఎం ఆదేశాల మేరకు మంగళవారం ఖైదీల తరలింపు ప్రక్రియను ప్రారంభించారు. జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది పర్యవేక్షణలో హైదరాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జైళ్లకు ఇక్కడి ఖైదీలను తరలిస్తున్నారు. వరంగల్ సెంట్రల్ జైలులో ప్రస్తుతం 957మంది ఖైదీలకు గాను 896 మంది పురుషులు, 61 మంది మహిళలు ఉన్నారు. తొలిరోజు 114 మందిని ఇతర జైళ్లకు తరలించారు. వీరిలో 75 మంది పురుషులను చర్లపల్లి జైలుకు, 39 మంది మహిళలను చంచల్గూడ జైలుకు పంపారు. ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసి కరోనా నిబంధనలకు అనుగుణంగా తరలిస్తున్నారు. శిక్షాకాలం, నేరాల తీవ్రత ఆధారంగా వారిని వివిధ జైళ్లకు కేటాయించారు. జైలులోని విధులు నిర్వహిస్తున్న 267 మంది అధికారులు, సిబ్బందిని కూడా ఆయా జైళ్లకు కేటాయించనున్నారు.