కరీంనగర్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇంజినీరింగ్ చదివి లెక్చరర్గా పనిచేసినవ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం తప్పటడుగులు వేశాడు. నకిలీ పత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టిస్తూ 13ఏండ్ల్లుగా అజ్ఞాతంలో ఉన్న అతడ్ని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. కామారెడ్డిలోని ఎన్జీవో కాలనీకి చెందిన కుందన శ్రీనివాసరావు అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శశాంకరావు తండ్రి టెలికాం డిపార్ట్మెంట్లో ఉన్నతోద్యోగి. 1991లో ఇంజినీరింగ్ పూర్తిచేసి.. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో 2006 వరకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అధ్యాపకుడిగా పనిచేశాడు. చాలీచాలని జీతంతో తన కోరికలు తీరడం లేదని మోసాలకు తెరలేపాడు. కొందరితో కలిసి ముఠాగా ఏర్పడి నకిలీ కిసాన్ వికాసపత్రాలు సృష్టిం చి బ్యాంకుల నుంచి కోటికిపైగా రుణాలు తీసుకొన్నాడు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, గుంటూరు తదితర జిల్లాల్లోని పోలీసుస్టేషన్లలో 40కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయన 2007లో ఏడాదిపాటు కరీంనగర్ జైలులో ఉన్నాడు. 2008లో జైలు నుంచి విడుదలయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లాడు.
పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు శ్రీనివాస్రావు కొత్త అవతారాలు ఎత్తాడు. కూర శశాంకరావు పేరుతో హైదరాబాద్కు మకాం మార్చాడు. నకిలీ ఆధార్, పాన్ కార్డులతో తరచూ చిరునామాలు మారుస్తూ హైదరాబాద్లోని పలు ప్రైవేటు కాలేజీల్లో మూడేండ్లపాటు అధ్యాపకుడిగా పనిచేశాడు. అక్కడినుంచి వరంగల్కు మకాం మార్చి కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత కుటుంబం లో తలెత్తిన వివాదంతో అతని భార్య వెళ్లిపోగా, తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్ముకొని విజయవాడ వెళ్లాడు. అక్కడ హోటల్లో కొంతకాలం పనిచేసి తర్వాత తిరుపతికి వెళ్లిపోయాడు. తిరుపతిలో ఓ రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో జీవనం దుర్భరంగా మారింది. మానసికంగా, ఆర్థికంగా చితికిపోయిన గత్యంతరం లేక భిక్షాటన మొదలుపెట్టాడు. శ్రీనివాస్ కనిపించట్లేదని అతని సోదరుడు శ్రీధర్ 2018లో వరంగల్, నిజామాబాద్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాడు. తిరుపతి శ్రీవారి దర్శనానికి వెల్లిన నిజామాబాద్ వాసులు అక్కడ భిక్షాటన చేస్తున్న శ్రీనివాస్ను గుర్తించి శ్రీధర్కు సమచారం ఇచ్చారు. దీంతో అతడు తన సోదరుడ్ని బెంగళూరుకు తీసుకెళ్లి ఒక ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం ఇప్పించాడు. వివిధ కేసుల్లో నాన్బెయిలబుల్ వారెంట్లు ఉన్న నిందితులను పట్టుకొనేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డి ‘ఆపరేషన్ తలాశ్’కు రూపకల్పన చేశారు. 40 వారంట్లున్న శ్రీనివాస్ను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఆ బృందం బెంగళూరులో శ్రీనివాస్ను అరెస్ట్ చేసింది.