వనపర్తి : ఆసియా ఖండంలోని మొట్టమొదటి ఆటోమేటిక్ సైఫన్స్ సిష్టం కలిగినటువంటి సరళాసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. భారీగా కురుస్తున్న వర్షాలకు ఎగువన పేరూరు, జంగమాయ పల్లి వాగుల ద్వారా వరదనీరు సరళాసాగర్ ప్రాజెక్టుకు చేరడంతో మంగళవారం నాలుగు ఉడ్ సైఫన్స్ తెరుచుకున్నాయి. గాలి పీడనం ద్వారా నీటిని పీల్చి కిందికి వదలడం సైఫన్స్ ప్రత్యేకత.
5వేల ఎకరాలకు సాగునీరు అందించే వరప్రదాయిని ఈ ప్రాజెక్టు విశిష్టత. 2019 డిసెంబర్31న ప్రాజెక్టుకు గండిపడి నీరంతా వృథా కాగా స్థానిక దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన 7నెలల కాలంలోనే ఆనకట్ట పనులు పూర్తి చేయించి, రైతులకు సాగునీరు అందించారు.