వెల్దుర్తి, మే 26: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివార్లలో ఈటల రాజేందర్కు చెందిన జమున హ్యాచరీస్ భూ కబ్జాపై ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతున్నది. బుధవారం విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్రెడ్డి, తాసిల్దార్ రాజశేఖర్, ఏసీబీ ఇన్స్పెక్టర్లు మురళీమోహన్, స్వామి, రమేశ్లు గతంలో అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో పనిచేసిన వీఆర్వోలు వీరాస్వామి, నర్సింలు, సర్వేయర్ నర్సింలును మాసాయిపేట తాసిల్ కార్యాలయంలో విచారించారు. రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారా? భూ పత్రాలు సక్రమంగా ఉన్నాయా? అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు, భూ సర్వే, హద్దులు వంటి వాటిపై వారిని విచారించిన అధికారులు, వారి నుంచి లిఖితపూర్వకంగా సమాధాన పత్రాలను తీసుకున్నారు. తాసిల్దార్ మాలతితో మాట్లాడిన అధికారులు, ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటి నుంచి ఏవైనా విషయాలు తన దృష్టికి వచ్చాయా? రికార్డుల్లో ఏమైనా మార్పులు, చేర్పులు జరిగాయా? అని అడిగి తెలుసుకున్నారు.
భూకబ్జాపై సంబంధిత రైతులకు అందించిన నోటీసులపై బుధవారం మరికొందరు వివరణ పత్రాలను అందజేశారు. మొత్తం 75 మంది రైతులకు నోటీసులు ఇవ్వగా, మంగళవారం 24 మంది, బుధవారం మరో 37 మంది రైతులు తమ వివరణ పత్రాలను అందజేశారు. మరో 10 మంది రైతులు సర్వే నిర్వహించి తమ భూములను చూపించాలని దరఖాస్తులు చేసుకున్నారు. వివరణ పత్రాలను రాంచంద్రం తాసిల్దార్కు అందజేశారు.