ఈటలకు ఆత్మవంచనే తప్పా ఆత్మగౌరవం లేదు
ప్రజాక్షేత్రంలో ప్రజలే గుణపాఠం చెబుతారు
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దొంత రమేశ్
హుజూరాబాద్, జూన్ 6: ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల రాజేందర్ ఆరాట పడుతున్నాడని, ఆత్మవంచనే తప్పా ఆయనకు ఆత్మగౌరవం లేదని టీటీడీ మాజీ అనుసంధాన అధికారి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దొంత రమేశ్ ఆరోపించారు. బోర్నపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతోనే చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనుభవిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ తనపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయనే అక్కసుతోనే సీఎం కేసీఆర్, ప్రగతి భవన్పై విరుచుకుపడుతున్నాడని ఆరోపించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా అవకాశం ఇచ్చింది సీఎం కేసీఆరేనన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ఇన్ని రోజులు సీఎం కేసీఆర్, ప్రగతి భవన్పై నోరు విప్పని ఈటల రాజేందర్ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఆత్మగౌరవం అని గొప్పలు చెప్పుకొంటున్న ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టి వచ్చారని ఎద్దేవా చేశారు. బీజేపీని విమర్శించిన ఈటలను పార్టీలోకి ఆహ్వానించడం విడ్డూరంగా ఉందన్నారు. అందితే కాళ్లు… అందకపోతే చేతులు అన్న రీతిలో ఈటల వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈటల వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నదని, ప్రజాక్షేత్ర ఎన్నికల్లో ఈటలకు గుణపాఠం తప్పదన్నారు. సమావేశంలో నాయకులు సందమల్ల బాబు, దుబాసి బాబు, ముక్క శ్రీనివాస్, ముక్క రమేశ్, తిరుపతి, తదితరులు ఉన్నారు.