కార్పొరేషన్లు: 1.వరంగల్, 2.ఖమ్మం
మున్సిపాలిటీలు: 1.సిద్దిపేట, 2.జడ్చర్ల, 3.అచ్చంపేట, 4.కొత్తూర్, 5.నకిరేకల్
మినీ పురపోరు ప్రచారం పరిసమాప్తమైంది. దాదాపు వారం రోజులపాటు హోరాహోరీగా జరిగిన ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ నెల 30న జరిగే పోలింగ్ కోసం అధికారులు కొవిడ్ నిబంధనలతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటు వేసే ప్రతీ ఒక్కరు విధిగా మాస్కు ధరించి పోలింగ్ స్టేషన్కు రావాలని, లేకపోతే స్టేషన్లోకి అనుమతించబోమని ఈసీ ప్రకటించింది. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూర్, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఖమ్మం కార్పొరేషన్లో 59 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా 250 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వరంగల్లో 66 డివిజన్లకు గాను 500 మంది, సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు 236 మంది, కొత్తూర్లో 12 వార్డులకు 47 మంది పోటీలో ఉన్నారు. జడ్చర్లలో 27 వార్డులకు 112 మంది, అచ్చంపేటలో 20 వార్డులకు 66 మంది, నకిరేకల్లో 20 వార్డులకు 93 మంది బరిలో ఉన్నారు. కాగా ఈనెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మే 3వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కొవిడ్ విజృంభిస్తున్నందున మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. ఓటు వేసే ప్రతీ ఒక్కరు విధిగా మాస్కు ధరించి పోలింగ్ స్టేషన్కు రావాలని, లేకపోతే స్టేషన్లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ నెల 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లకు ఎన్నికల కమిషన్ పలు జాగ్రత్తలను సూచించింది. మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఓటు వేయాలని తెలిపింది. విధుల్లో పాల్గొనే సిబ్బందికి మాస్క్, ఫేస్ ఫీల్డ్, గ్లౌజ్ అందించనున్నట్టు వెల్లడించింది. ఎన్నికల ముందురోజు పోలింగ్ స్టేషన్ మొత్తాన్ని శానిటైజ్ చేయనున్నట్టు, ఓటర్ల కోసం ప్రతి స్టేషన్ బయట శానిటైజేషన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించింది. వైద్యసిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొన్నది. డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్లుగా విశాల మైదానాలు కలిగిన భవనాలను గుర్తించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఒకేదగ్గర రద్దీ ఉండకుండా విశాలమైన హాళ్లను కౌంటింగ్ కేంద్రాలుగా గుర్తించారు. కౌంటింగ్ సిబ్బందికి అవసరమైతే పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. అటు.. 80 ఏండ్లు దాటిన ఓటర్లు, వికలాంగులు, ఏప్రిల్ 15 తర్వాత కొవిడ్ వచ్చినవాళ్ల సౌకర్యార్థం కోసం పోస్టల్ బ్యాలెట్ను అమలు చేస్తున్నారు.