పెద్దవూర/గుర్రంపోడు, ఏప్రిల్ 7 : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్కు ఓటేస్తే వృథానేనని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం నియోజకవర్గంలోని పెద్దవూరలో నిర్వహించిన ధూంధాంలో పాల్గొన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, నాలుగుసార్లు మంత్రి పదవులు చేపట్టినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. స్థానిక ప్రజలకు సాగు, తాగునీరవ్వని చరిత్ర ఆయనేదనన్నారు. సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన జానారెడ్డి నియోజకవర్గానికి ఏమి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలు వచ్చినప్పుడే ఆయనకు గ్రామాలు గుర్తుకొస్తాయని, తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని యాదవులు గొర్రెల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, త్వరలో 3 లక్షల యూని ట్లు మంజూరవుతాయని చెప్పారు. దివంగత నేత నోముల నర్సింహయ్య బడుగు బలహీనవర్గాల నాయకుడని, ఆయన తనయుడు భగత్తోనే నియోజవకర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. భగత్ను గెలిపించాలని కోరారు. అంతకుముందు గుర్రంపోడు మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ గెలుపు కోసం మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శంగా తెలంగాణ పథకాలు: హోంమంత్రి
మిర్యాలగూడ టౌన్, ఏప్రిల్ 7: అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం మిర్యాలగూడలో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. కనీసం ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ నుంచి జానారెడ్డి గెలిచినంత మాత్రాన నియోజకవర్గం అభివృద్ధి జరుగదని, అలాంటప్పుడు ఆయనకు ఓటు వేస్తే వృథా అవుతుందని చెప్పారు. భగత్ను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
జానారెడ్డి చేసింది శూన్యం : మంత్రి జగదీశ్రెడ్డి
తిరులమగిరి సాగర్, ఏప్రిల్ 7 : జానారెడ్డి సాగర్ నియోజకవర్గంలో చేసింది శూన్యమని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలగిరి సాగర్ మండలంలోని సుంకిశాలతండాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ప్రజలు అభివృద్ధి చేసే నాయకుడికి ఓటు వేయాలని కోరారు. సుంకిశాలతండాను దత్తత తీసుకొని ప్రతి సమస్యనూ పరిష్కరిస్తానని, భగత్కు ఓటేసి గెలిపించాలని మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎంసీ కోటిరెడ్డి, నోముల భగత్ సతీమణి భవాని పాల్గొన్నారు.