హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఈఎస్ఐ కార్డుదారులు, వారి కుటుంబసభ్యులెవరైనా రిఫరల్ లేకుండానే అన్ని ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకోవచ్చని ఈఎస్ఐ కార్పొరేషన్ ప్రకటించింది. కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఆ వైద్య ఖర్చులను తర్వాత రీయింబర్స్మెంట్ చేస్తామని స్పష్టంచేసింది. వైరస్ సోకితే ఈఎస్ఐ దవాఖానల్లో ఉచిత వైద్యం, మందులతో పాటు సిక్నెస్ బెనిఫిట్స్ కల్పించాలని కూడా ఈఎస్ఐసీ నిర్ణయించింది. ఈ మేరకు దవాఖానలను కొవిడ్ డెడికేటెడ్ దవాఖానలుగా ప్రకటించింది. ప్రతి దవాఖానలో 20 శాతం బెడ్లను కరోనా బాధితుల కోసం కేటాయించింది. హైదరాబాద్లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీతో పాటు హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ప్లాస్మా థెరపీ అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నది. అంతేకాకుండా, కొవిడ్ కారణంగా విధులు నిర్వర్తించలేక, ఇంటివద్దే సెలవులో ఉన్నవారికి 91 రోజుల పాటు 70 శాతం వేతనం ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఉద్యోగం పోతే అటల్ బీమిట్ వ్యక్తి కల్యాణ్ యోజన(ఏబీవీకేవై) కింద 90 రోజుల పాటు 50 శాతం వేతనం ఇస్తామని సంస్థ తెలిపింది.