అలంపూర్, జూన్ 23 : ఏపీ ప్రభుత్వం దూకుడు తగ్గించి అక్రమ నిర్మాణాలను ఆపాలని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణ యం మేరకు బుధవారం అలంపూరు మండలం గుందిమల్ల గ్రామశివారులో కృష్ణానదిపై జోగుళాంబ బ్యారేజీ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం, ఎఫెక్స్ అనుమతులు లేకుండా కృష్ణా, తుంగభద్ర నదులపై నిర్మించే ప్రాజెక్టులను ఆపకపోతే సహించేదిలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కంటే ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసేలా జోగుళాంబ బ్యారేజీ నిర్మించుకుంటామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాలుగు ఎత్తిపోతల ద్వారా 5లక్షల ఎకరాలకు నీరు తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నారన్నారు.
ఆ విధంగా జరిగితే అలంపూరు ప్రాంతంలోని 87,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందే అవకాశం లేకుండాపోతుందన్నారు. అలాగే 130 గ్రామాల ప్రజలకు తాగునీరు దొరికే అవకాశం కూడా ఉండదన్నారు. ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటర్ వద్ద చేపట్టిన కుడికాల్వ నిర్మాణం అక్రమమన్నారు. తెలంగాణ రైతాంగం కడుపుకొట్టే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు నిర్ణయం తీసుకున్న ప్రకారం సుంకేసుల రాజోలి వద్ద ఎత్తిపోతలు ఏర్పాటు చేసుకుని అలంపూరు ప్రాంతానికి రావాల్సిన సాగునీరు తీసుకునేందుకు వెనుకాడమన్నారు. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ నీటి వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర నీటి వినియోగ పరిష్కారాలపై కేంద్రం స్పందించాలని, ఇలాగే చోద్యం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఊరికే ఉండదన్నారు. కార్యక్రమంలో గుందిమల్ల సర్పంచ్ వసుంధరపెద్దారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మన్న,మాజీ సర్పంచ్ అయ్యస్వామి, నరేందర్ పాల్గొన్నారు.