న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ల సరఫరాకు ముందు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్రానికి హితవు పలికింది. ప్రస్తుత వేగంతో వ్యాక్సినేషన్ సాగితే దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసేందుకు కనీసం 15 ఏండ్లు పడుతుందని పేర్కొంది. ముందుగా దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించకుండానే వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కారణమేంటని ఆప్ ప్రతినిధి రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
84 దేశాలకు వ్యాక్సిన్ డోసులను ఎగుమతి చేశారని, దేశ ప్రజలకు అందించిన డోస్ల కంటే ఎగుమతి చేసిన వ్యాక్సిన్ డోసులే అధికమని అన్నారు. ముందుగా మన దేశ ప్రజల పట్ల జాగ్రత్త వహిస్తామా లేకుంటే ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తామా అని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం జాతీయవాదం ఎక్కడికిపోయిందని ఆప్ నేత నిలదీశారు. ప్రతి భారతీయుడికి వ్యాక్సిన్ ఇచ్చేలా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆప్ డిమాండ్ చేస్తోందని అన్నారు.