హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) వెల్లూరు 36 స్నాతకోత్సవం మంగళవారం వర్చువల్గా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామమూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టుల్లో అపారమైన నైపుణ్యం సాధించి ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు. భారతదేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. వీఐటీ వ్యవస్థాపకుడు, చాన్స్లర్ డాక్టర్ జీ విశ్వనాథం మాట్లాడుతూ.. దేశంలో 14 కోట్ల మంది యువతకు అర్హత ఉన్నప్పటికీ 4 కోట్ల మంది మాత్రమే ఉన్నత విద్యను పొందుతున్నారని అన్నారు. మొత్తం 7,569 మంది యూజీ, పీజీ, పరిశోధన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.