హుజూరాబాద్, ఆగస్టు 25: నాలుగు కోట్ల ప్రజానీకానికి సేవచేసే భాగ్యం వచ్చిందంటున్న రేవంత్కు దమ్ముంటే హుజూరాబాద్ నుంచి పోటీచేసి డిపాజిట్ తెచ్చుకోవాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ సవాల్ విసిరారు. కొత్తబిచ్చగాడులా నోటికి అడ్డూ అదుపులేకుండా మాట్లాడుతున్నాడని అగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ కోసం ప్రాణార్పణకు సిద్ధమైన సీఎం కేసీఆర్పై విమర్శలుచేస్తే సహించబోమని హెచ్చరించారు. బుధవారం హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి రైతులు, దళితులు, ఆదివాసీలు, బడుగు బలహీనవర్గాలకందరికీ తెలుసు.. కానీ రేవంత్ అనే మూర్ఖుడికి మాత్రం అర్థంకావడం లేదని విమర్శించారు. ‘బ్లాక్మెయిల్చేసి సంపాదించిన డబ్బుతో దొంగదీక్షలు చేస్తున్నవ్.. మూడుచింతలపల్లిలో కూర్చొని తొక్కుతా అని మాట్లాడుతున్నావ్.. నువ్వా మమ్నల్ని తొక్కేది.. గొంతుపట్టి పిసికితే చచ్చిపోతవు’ అని ధ్వజమెత్తారు. అసలు సిసలైన ఆత్మగౌరవ సభావేదిక ఎట్లుంటదో మల్కాజిగిరిలో చూపిస్తారా అంటూ సవాల్ విసిరారు. దళితులకు ఇచ్చే పదిలక్షలు బోడి అంటవా? అని నిలదీశారు. కొడంగల్ ప్రజలు ఓడిస్తే మల్కాజిగిరికి వచ్చిపడ్డవ్.. ఇక్కడా ఏదో అత్తెసరుగా గట్టెక్కి పెద్దగా ప్రచారం చేసుకుంటున్నవ్ అని మండిపడ్డారు. రేవంత్ ఊర్లో ఎన్నోసార్లు టీఆర్ఎస్ గెలిచింది. నా నియోజకవర్గంలో నా ఓటరు అని సిగ్గుపడి ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు అని అన్నారు. పీసీసీ పదవి రాగానే సీఎం అయినట్టు ఫోజులు కొడుతున్నడని.. ఆయనతో రావడానికి సొంతపార్టీ నేతలే ఇష్టపడడం లేదని ఎద్దేవా చేశారు.
రేవంత్ ఆదేశాలతో సోదరిమణి సీతక్క.. చంద్రబాబు కాళ్లు మొక్కుతున్నదని.. అసలు ఆయనను ఎవరు నడిపిస్తున్నరో తెలంగాణ ప్రజలకు తెలుసునని గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణ నుంచి దోచుకున్న డబ్బులతో రేవంత్ను చంద్రబాబు పోషిస్తున్న సంగతి అందరికీ తెలుసునని చెప్పారు. ఎంపీ అయ్యాక ఎంతమంది వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నది సమాచారం ఉన్నదని, త్వరలో చిట్టా బయట పెడుతానని చెప్పారు. ఓటుకునోటు కేసులో దొరికి చిప్పకూడు తిన్న రేవంత్.. ఇక అంతకంటే మించిన శిక్ష ఏం ఉంటుందని తెగేసి మాట్లాడుతున్నాడని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఒక్క ఊరినేకాదు.. రాష్ర్టాన్నే దత్తత తీసుకున్నడు.. భవిష్యత్లో దేశానికి కూడా ప్రాతినిథ్యం వహిస్తాడని పేర్కొన్నారు. ‘మా అయ్య పోలీస్ పటేల్.. మా తాత ఇంకో పటేల్, నేనొక బుడ్డర్ఖాన్, నేనొక దొంగ’ అంటూ రేవంత్ చెప్పే విషయాలు ప్రజలు గమనిస్తున్నారని బాలరాజు తెలిపారు. రేవంత్రెడ్డి ఎన్నెకరాల ఆసామి.. ఆయనకు వందలవేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినయ్ అని నిలదీశారు. అడ్డంగా సంపాదించిన డబ్బుతో నోటికొచ్చినట్టు, అహంకారంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయిన విషయం ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.