హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ అటానమస్ కోఠి ఉమెన్స్ కాలేజీలో బీ.ఏ. హానర్స్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కొత్త కోర్సులను మంగళవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీ, నిజాం కాలేజీలలో బీ.ఏ. హానర్స్ కోర్సులను బోధించనున్నారు.
ఈ ప్రత్యేక కోర్సుల వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వినోద్ కుమార్ అన్నారు. పోటీ ప్రపంచంలో ఈ కోర్సుల వల్ల విద్యార్థులు నిలదొక్కుకోగలుగుతారని తెలిపారు. ప్రస్తుతం హానర్స్ కోర్సులు ఢిల్లీ వంటి నగరాలలోనే ఉందని, ఇప్పుడు హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీ దేవీ, కాలేజీయేట్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణ, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విజ్జులత, తదితరులు పాల్గొన్నారు.