హైదరాబాద్ : తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ర్ట పౌరసరఫరాల సంస్థ రికార్డు సృష్టించింది. 21 రోజుల్లో 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 10 రోజుల్లో 21.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఇంత పెద్ద ఎత్తున దేశంలో ధాన్యం పండించిన ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. దాదాపు రూ. 10 వేల కోట్లతో 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేస్తామన్నారు. కరోనా కష్టకాలంలోనూ ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని తేల్చిచెప్పారు. రాష్ర్ట వ్యాప్తంగా 7 వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.