హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): భారత సైన్యంలో తెలంగాణ పేరు తో రెజిమెంట్ను ఏర్పాటుచేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ శనివారం కోరారు. ఈ రెజిమెంట్ ఏర్పాటుచేస్తే తెలంగాణ వ్యక్తులుగా దేశ సేవలో మేమూ ఉన్నామని గర్వంగా భావిస్తామని పేర్కొన్నా రు. తెలంగాణకు ఇండియన్ ఆర్మీ ఇన్ఫ్యాన్ట్రీ రెజిమెంట్ ఏర్పాటు ఆవశ్యకతను లేఖలో వివరించారు. తనను కలిసిన మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు ఇచ్చిన సమాచారం మేరకు లేఖ రాస్తున్నట్టు తెలిపారు. సైన్యంలో కొత్తగా మూడు బలగాలతో సిఖ్, కుమాన్, జమ్మూకశ్మీర్ పేర్లతో రెజిమెంట్లు ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు తెలిసిందని, తెలంగాణ పేరుతో కూడా మరో రెజిమెంటును ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు.
స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్ రెజిమెంట్
దేశానికి స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోనే హైదరాబాద్ పేరుతో రెజిమెంట్ ఉండేదని వినోద్కుమార్ తన లేఖలో ప్రస్తావించారు. మొదటి ప్రపంచ యుద్ధం చివరిరోజుల్లో ‘లష్కర్ ఆఫ్ ది హైదరాబాద్’ పేరుతో 19వ రెజిమెంట్ను ఏర్పాటుచేశారని, అది రెండో ప్రపంచయుద్ధం వరకు ఎంతో కీలకంగా పనిచేసిందని గుర్తుచేశారు. జంగిల్ వార్ఫేర్లో నిష్ణాతులైన హైదరాబాద్ రెజిమెంట్ సిబ్బంది మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా, పర్షియా, మలయా, సింగపూర్, బర్మాల్లో యుద్ధాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఆ రోజుల్లో అత్యంత శక్తిమంతమైన రెజిమెంట్గా హైదరాబాద్కు పేరుండేదని చెప్పారు. ప్రస్తుతం ఆర్మీ రెజిమెంట్లో తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్నదని, దీనివల్ల అనేక అంశాల్లో సమస్యలు వస్తున్నాయని వివరించారు. ఇండియన్ ఆర్మీకి సేవలు అందించడంలో తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు గొప్ప చరిత్ర ఉన్నదని బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
అందుబాటులో సరిపడా భూములు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములున్నాయని, ఎకో సిస్టం ఉన్నదని బోయినపల్లి వినోద్కుమార్ తన లేఖలో వివరించారు. గతేడాది చైనా సైనికులతో పోరాడుతూ కర్నల్ సంతోష్బాబు వీర మరణం పొందిన ఘటనపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మనస్ఫూర్తిగా స్పందించారని తెలిపారు. తెలంగాణ పేరిట రెజిమెంట్ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. పంజాబ్లో పంజాబ్, సిఖ్, డోగ్రా రెజిమెంట్లు, హర్యానాలో జాట్ రెజిమెంట్, జమ్మూకశ్మీర్లో జమ్మూ అండ్ కశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్లు, రాజస్థాన్లో రాజ్ రైఫిల్స్, రాజపుత్, జాట్ రెజిమెంట్లు, బీహార్లో బీహార్ రెజిమెంట్, మహారాష్ట్రలో మరాఠా, మహర్ రెజిమెంట్లు, అస్సాంలో అస్సాం, నాగా రెజిమెంట్లు ఉన్నాయని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు కలిపి మద్రాస్ రెజిమెంట్ మాత్రమే ఉన్నదని గుర్తుచేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పేరిట రెజిమెంట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.