బడంగ్పేట, మే 5 : మహమ్మారి విజృంభణతో కుటుంబ సభ్యులే దూరం జరుగుతున్న ఈ రోజుల్లో కొవిడ్ రోగులకు పెద్ద దిక్కుగా మారుతున్నారు బడంగ్పేట బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మంగు రాఘవరావు. ముఖ్యంగా బ్రాహ్మణులను ఆదుకునేందుకు ఆయన ముందుకొస్తున్నారు. కొవిడ్ బారిన పడిన బ్రాహ్మణులకు ఇంటి వద్దనే ఆహారం అందజేస్తున్నారు. నెలరోజులుగా సేవ చేస్తూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు.
కరోనా సోకి ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులకు ఉచితంగానే ఆహారం అందజేస్తున్నాం. ఇమ్యూనిటీ పెంచేందుకు డ్రైఫూట్స్ ఇస్తున్నాం. తోటి వారికి సాయం చేయాలన్న సంకల్పంతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రస్తుతం కరోనా వచ్చిందంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. పాజిటివ్ రోగులకు భోజనం వండుకునే పరిస్థితి లేదు. ఈ ఇబ్బందులు గమనించి ప్రతి రోజు ఇరవై నుంచి ముప్పై ఐదు మంది బ్రాహ్మణులకు ఆహారం అందజేస్తున్నాం. -మంగ రాఘవరావు
మీర్పేట, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బ్రాహ్మణులతో కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. అందులో కొవిడ్ బారిన పడిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. వెంటనే వారికి కావాల్సిన సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. రెండు కార్పొరేషన్ల పరిధిలో పాజిటివ్ సోకిన ౩౦ మంది వ్యక్తులకు ఉదయం, సాయంత్రం టిఫిన్.. మధ్యాహ్నం భోజనం అందజేస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంపు కోసం డ్రైఫూట్స్ను ఇస్తున్నారు. గాయత్రీ క్యాటరింగ్ గంప మాధవరావు సహకారంతో రాఘవరావు కొవిడ్ రోగులకు ఉచిత భోజనం అందజేస్తున్నారు. బ్రాహ్మణులతో పాటు ఇతరులు ఎవరైనా ఫోన్ చేస్తే వారికీ భోజనం పంపిస్తున్నారు. గతంలో విధించిన లాక్డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణులను గుర్తించి నిత్యావసరాలు పంపిణీ చేశారు. మొదట బ్రహ్మణులకే అనుకున్నా ఇతర వర్గాల నుంచి విపరీతంగా ఫోన్లు రావడంతో అందరికీ పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నామని బ్రాహ్మణ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. కరోనా విజృంభణ తగ్గే వరకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామంటున్నారు.