ముల్కనూర్: ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని, రొటీన్గా ఉన్న పంటల సాగు విధానాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ముల్కనూర్ సొసైటీలో ఆయన సోమవారం నాడు ముల్కనూర్ సహకార సంఘం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు, వ్యవసాయ, సహకార రంగం నిపుణులతో ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్, ప్రవీణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన పలు మార్పులపై చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రొటీన్గా సాగుతున్న పంటల సాగు విధానాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఏ సీజన్లో ఏయే పంటలు వేయాలి, పంటల మార్పిడికి అనుసరించాల్సిన విధి విధానాలను లోతుగా అధ్యయనం చేసేందుకు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రైతులు, వ్యవసాయ, సహకార నిపుణులతో చర్చా గోష్ఠి నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మంచి స్పందన
హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు మంచి స్పందన లభిస్తోందని బోయినపల్లి వినోద్ కుమార్, ప్రవీణ్ రెడ్డి చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తే భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపొందడం ఖాయంగా కనిపిస్తోందని వారు తెలిపారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులు, ఇతర వర్గాలలో తనకు వస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తుంటే టీఆర్ఎస్ చాలా బలంగా ఉందని, అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్తోనే ఉన్నట్లు స్పష్టం అవుతోందని ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఈ భేటీలో ముల్కనూర్ సర్పంచ్ కొమురయ్య, మాజీ సర్పంచ్ భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.