తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలో ‘చంద్రధన’ అనే మారుమూల కుగ్రామం. ఇప్పుడు ఈ గ్రామం ప్రపంచ పటంలో చోటు సాధించింది. అది ఎలగంటరా ఈ గ్రామం నుంచే రెక్కాడితే గాని డొక్కడని పేద కుటుంబం నుంచి అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించడానికి అర్హత సాధించింది. ‘చంద్రధన’ గ్రామానికి చెందిన దళిత కుటుంబం రావిచెట్టు సాయిలు-ఎల్లమ్మ, వీరికి ఇద్దరు పిల్లలు. వీరి కూతురు శిరీష ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు తన సొంత గ్రామంలో విద్యాబ్యాసం చేసి 5వ తరగతికి జడ్చర్ల గురుకులం పాఠశాలలో ప్రవేశం పొంది అక్కడే ఇంటర్ వరకు పూర్తి చేసింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని సోషల్వెల్పేర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతుంది. తెలుగు మీడియం చదువుతున్న శిరీష మేదస్సును గమనించిన ఉపాధ్యాయులు ఆంగ్లంపై శ్రద్ధపెడితే మంచి భవిష్యత్ ఉంటుందని పోత్సహించడంతో ఆంగ్లమాభాషపై పట్టు సాధించింది. పట్టుదలతో పాటు నేను సాదిస్తా అనే ఆత్మసైర్యంతో ముందుకెలితే ఎదైనా సాధించవచ్చునని నిరూపించింది శిరిష. న్యూయార్క్లో ఉన్నత విద్యకు గురుకుల విద్యార్థిని ఎంపిక కావడంతో తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది.
గురుకులం నిర్వహకులు అమెరికా నిర్వహించే పలు ఎంపిక పరీక్షలకు విద్యార్థినులను ప్రోత్సహించారు. వారు నిర్వహించిన ఎంపిక పరీక్షల్లో అర్హత సాదించిన శిరీష అమెరికాలోని విశ్వవిద్యాలయంలో ఉచితంగా విద్య అబ్యాసించే అవకాశం దక్కింది. దేశవ్యాప్తంగా 20మంది పరీక్షలు రాయగా తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. అందులో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామానికి చెందిన శిరీష ఎంపిక కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల దీన స్థితిని గుర్తించిన శిరీష తనకు ఇష్టమైన చదువుతోనే వారి కష్టాలు తీర్చాలనుకుంది. చిన్ననాటి నుంచి కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతూ డిగ్రీ వరకు చదివింది. తెలంగాణ సర్కార్ ప్రవేషపెట్టిన గురుకుల డిగ్రీ కళాశాల నుంచి అమెరికా అందించే కమ్యూనిటీ కాలేజ్ ఇన్సియేట్ ప్రోగ్రాం ఫెలోషిప్కు అర్హత సాదించింది. న్యూయార్క్లో జేమ్స్టౌన్కమ్యూనిటి కాలేజిలో ‘ఏర్లీచైల్డ్ ఎడ్యూకేషన్’(సంవత్సరం కోర్సు)ను అభ్యసించనుంది. అమెరికా ప్రభుత్వమే ప్రతి నెల స్టైఫండ్ అందించడంతో పాటు వసతులు కల్పిస్తున్నది. గడిచిన ఆరు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ర్టం నుంచి 20మంది విద్యార్థినులు అమెరికాన్ కమ్యూనిటీ కాలేజికీ ఎంపికయ్యారు.
ఉన్నతమైన ఉద్యోగం సాదిస్తా..
శిరీష, విద్యార్థిని
భవిష్యత్లో ఉన్నతమైన ఉద్యోగం, జీవితంతో పాటు తమ కుటుంబం తలరాతను మారుస్తాననే భరోసా వచ్చింది. గురుకులాలలో చేరడంతోనే అధికారులు, ఉపాధ్యాయుల సహకారం మరిచిపోలేనిది. తెలుగు మీడియంలో చదివి గ్రంథాలయాల్లో ఇంగ్లీష్ పుస్తకాలు చదివి భాషపై పట్టుసాదించా. ఐఎఎస్ కావడమే నా లక్ష్యం, నాలాంటి పేద పిల్లలకు సహకారం అందిస్తా.
మా పిల్లలను చదివించేందుకు ఎంతో కష్టపడ్డాం..
రావిచెట్టు సాయిలు, ఎల్లమ్మ, శిరీష తల్లితండ్రులు
మాకున్న ఇద్దరిని బాగా చదివించేందుకు ఎంతో కష్ట పడుతున్నాం. మా కష్టాలను రోజు చూస్తున్న మా పిల్లలు కన్నీరు పెట్టేవాళ్లు. మీరు బాగా సదువుకుంటే ఇసోంటి కష్టాలు రావు బిడ్డా అని ఎప్పుడు చెప్పేవాళ్లం. గురుకుల పాఠశాలలో మా బిడ్డకు సీటువచ్చినప్పుడు సదువుకు కావలసిన అన్ని వసతులు గవర్నమెంట్ చూసుకోవడంతో మాపై చదువు బారం తగ్గింది. నాబిడ్డ అమెరికాపోయి సదువుతుందంటే గురుకుల పాఠశాల పుణ్యమే మా అసోంటి పేద పిల్లలకు గురుకుల పాఠశాలలు పెట్టిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.